KTR on Congress: పంచాయతీ తొలిదశ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ మద్దతుదారులు హోరాహోరీగా పోరాడారని ఎక్స్ వేదికగా తెలియజేశారు. తొలి దశ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లు , వార్డు మెంబర్లకు హృదయక పూర్వక శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మెుక్కవోని ధైర్యంతో సైనికుల్లా గులాబీ శ్రేణులు నిలబడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు.
‘ప్రజా వ్యతిరేకత బయటపడింది’
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారని కేటీఆర్ ఆరోపించారు. అయినప్పటికీ పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటలేకపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఫలితాలతో రుజువైదంని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఒక్కటే ప్రత్యామ్నయం
తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టాయని పేర్కొన్నారు. ‘వచ్చే మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని, గ్రామస్థులు నిర్ధారణకు రావడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం.. అనేక చోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా అర్థమైపోతోంది’ అని కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు.
‘ద్రోహాన్ని ప్రజలు మర్చిపోలేదు’
ఆరు గ్యారంటీల పేరిట సీఎం రేవంత్ చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదని కేటీఆర్ అన్నారు. ‘పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మరిచిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి. యూరియా బస్తాల కోసం నెలల తరబడి పడిన అగచాట్లను, బోనస్ పేరిట చేసిన బోగస్ హామీని, చివరికి పండించిన పంటను అమ్ముకోలేక పడ్డ కష్టాలను అన్నదాతలు గుర్తుపెట్టుకున్నారని ఈ ఫలితాలు రుజువుచేశాయి’ అని కేటీఆర్ అన్నారు.
Also Read: CM Chandrababu: విశాఖలో మరో మైలురాయి.. కాగ్నిజెంట్ ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
గులాబీ జెండా ఎగరడం తథ్యం
గత పదేళ్లపాటు ప్రగతిపథంలో సాగిన పల్లెల్లో రెండేళ్లుగా పాలన పడకేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘గాడితప్పిన పారిశుధ్యం, చివరికి ట్రాక్టర్లలో డిజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలన్నీ పల్లె ప్రజలను ఆలోచింపజేసినట్టు ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’ అని ఎక్స్ లో కేటీఆర్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.
కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని…
— KTR (@KTRBRS) December 12, 2025

