BC Reservations: ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికల నగారా మోగక ముందే రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఈ దపా తప్పనిసరిగా బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్టులు వెల్లువెత్తుతున్నాయి. బీసీ రిజర్వేషన్లను ఈ సారైనా అమలు చేయాలని పార్టీలోని బీసీ నేతలే హైకమాండ్ ను రిక్వెస్ట్ చేయడం గమనార్హం. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగాలని, లేనిపక్షంలో రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు వివరిస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ కొంత మేరకు మాత్రమే బీసీలకు అవకాశాలు లభించాయని, కానీ ఈసారి పరిస్థితి వేరని బీసీ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
శాసించేది బీసీలే..
జనాభాలో సింహభాగం ఉన్న తమకు,ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నియోజకవర్గాల వారీగా బీసీ ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కేటాయించాల్సిన అవసరం ఉన్నదని వివరిస్తున్నారు. కుల గణనను పరిశీలించి తమకు సీట్లు కేటాయించాలని పట్టుపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీల గెలుపోటములను శాసించేది బీసీలేనని,వారికి తగిన గుర్తింపు లేకపోతే క్యాడర్లో అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.ఇదే అంశాన్ని వివరించేందుకు సీఎం, కేబినెట్ మంత్రులను కలవాలని బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు భావిస్తున్నారు.
Also Read: K 4 Missile: ‘కే-4 మిసైల్’ను పరీక్షించిన భారత్.. దీని రేంజ్ ఏంటో తెలుసా?
ఢిల్లీ పెద్దలకూ లేఖల అస్త్రం..
రాష్ట్ర స్థాయి నేతలతోనే కాకుండా, తమ డిమాండ్లను ఢిల్లీలోని అగ్ర నాయకత్వానికి చేరవేయాలని బీసీ సంఘాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా(Sonia Gandhi), రాహుల్(Rahul), ప్రియాంక(Priyanka), మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), కేసీ వేణుగోపాల్(KC Venugopal) లకు నేరుగా లేఖలు రాయాలని బీసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని భావిస్తున్నారు. ఏ పార్టీ అయితే తమకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తుందో, ఆ పార్టీకే మద్దతు ఇవ్వాలనే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ఎంపికలో బీసీలకు పెద్దపీట వేసేలా హామీ పొందాలని బీసీ సంఘాలు ఆలోచిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లోని బీసీ నేతలు కూడా తమ కులానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. బీసీలకు న్యాయం చేయకపోతే రాజకీయ భవిష్యత్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని టీ కాంగ్రెస్ కు చెందిన ఓ బీసీ నేత తెలిపారు.
42 శాతంపై పట్టు…?
బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నా..ఆర్డినెన్స్ పై గవర్నర్, బిల్లుపై రాష్ట్రపతిలు సంతకాలు చేయలేదు. దీంతో కాంగ్రెస్క కు రిజర్వేషన్ల అంశం చిక్కుముడిగా మారింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్ కు పంపించిన ఆర్డినెన్స్ ఇప్పటికీ క్లియర్ కాలేదు.స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు పంచాయితీ రాజ్ చట్టం సవరించాలంటే గవర్నర్ సంతకం తప్పనిసరి. గవర్నర్ సంతకం పూర్తయితే ప్రభుత్వం వెంటనే జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నది.మరోవైపు కోర్టుల్లో కేసులు కూడా సర్కార్ నిర్ణయాలకు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ సింబల్ పై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది? ఇప్పుడు సస్పెన్షన్ గా మారింది.
Also Read: The Raja Saab: ‘ది రాజా సాబ్’ క్రిస్మస్ గిఫ్ట్.. ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో.. ఇక ప్రేయర్లే!

