Minister Sridhar Babu: ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీ(AI Univercity)లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను నెలకొల్పనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలోనే ఈ తరహా నైపుణ్య శిక్షణ కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) మొట్టమొదటిదని మంత్రి తెలిపారు. డీకిన్ అప్లయిడ్ ఆర్టిఫిషియల్ ఇన్ స్టిట్యూట్ ఈ ఎక్సెలెన్స్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తుందని వివరించారు. కాళేజీల నుంచి అకడమిక్ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు.
భవిష్యత్తుకు తెలంగాణ
విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందం అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలన, ఆరోగ్యం(Health), విద్య, ఐటీ(IT), లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ రంగాల్లో పరిశోధన, నైఫుణ్య శిక్షణ అందజేయడానికి ఈ సెంటర్ ఎక్స్ లెన్స్ ఉపయోగపడుతుందని, డిజిటల్ ఇండియా భవిష్యత్తుకు తెలంగాణ ముఖ ద్వారం కానుందని తెలిపారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా మంత్రి జూలియన్ హిల్, ప్రభుత్వ ఐటీ సలహాదారుడు సాయిక్రిష్ణ, ఆస్ట్రేలియా ప్రతినిధులు క్యామ్ గ్రీన్, కరేన్ సాండర్ కాక్, నథానియెల్ వెబ్, స్టీవెన్ బిడిల్, హిల్లరీ మెక్ గీచి, స్టీవెన్ కానోలీ, విక్రం సింగ్ పాల్గొన్నారు.
Also Read: MD Amir Pasha: ఎంపీ ఈటల రాజేందర్ వీరాభిమాని గుండెపోటుతో మృతి..!

