Corruption Cases: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆస్తులు పోగేసుకుంటున్న అధికారుల గుండెల్లో ఏసీబీ(ACB) దడ పుట్టిస్తోంది. పక్కాగా సమాచారాన్ని సేకరిస్తూ లంచావతారాలను కటకటాల వెనక్కి పంపిస్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబరు నెలాఖరు నాటికి 203 కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు 119మంది ప్రభుత్వ ఉద్యోగులను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవలే ఏసీబీ(ACB) డీజీగా బాధ్యతలు స్వీకరించిన చారూ సిన్హా ఆమ్యామ్యాలకు మరిగిన వారి ఆట కట్టించేందుకు మరింత పకడ్భంధీగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. అవినీతికి కళ్లెం వేసి పాలనలో పారదర్శకతను పెంపొందించటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో ఏసీబీ(ACB) పని తీరు అంతంత మాత్రంగానే ఉందన్న విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ హయాంలో అవినీతి అధికారులకు సంబంధించిన కేసులు ఏ ఒక్క సంవత్సరం కూడా రెండు వందలు దాటక పోవటం గమనార్హం.
ఆదాయానికి మించి ఆస్తులు..
ప్రధానమైన ప్రభుత్వ విభాగాల్లో కీలక స్థానాల్లో పని చేసిన కొందరు అధికారులు పొలిటికల్ గాడ్ ఫాదర్ల అండతో తాము ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా వ్యవహరించారు. అవకాశం దొరికిన ప్రతీ చోటా చేతివాటాన్ని ప్రదర్శించి వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారు. దీనికి నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) లో ఈఎన్సీలుగా పని చేసిన హరిరామ్.. మురళీధర్ రావులను ఉదహరించ వచ్చు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా అందిన సమాచారంతో దాడులు చేసినపుడు బయట పడ్డ ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే షాక్ కు గురయ్యారు. ఈ ఇద్దరి వద్దనే మార్కెట్ రేటు ప్రకారం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు బయట పడటం గమనార్హం.
కాగా, కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖల్లో పెరిగిపోయిన అవినీతి జాఢ్యంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అవినీతికి మరిగిన వారు ఎవ్వరైనా.. ఎంతటివారైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ వద్దని స్పష్టంగా చెప్పింది.
Also Read: Ramchander Rao: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికకు త్రీ మెన్ కమిటీ.. ముఖ్య నేతలు వీళ్ళే!
లంచావతారా కేసులే అధికం..
ఈ క్రమంలో ఏసీబీకి(ACB) ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఈ సంవత్సరం ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. జనవరి నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు మొత్తం 203 కేసులు నమోదు చేశారు. వీటిలో రెడ్ హ్యాండెడ్ గా లంచావతారాలను పట్టుకున్కన కేసులే 119 ఉండటం గమనార్హం. ఇక, అక్రమాస్తులు కలిగి ఉన్న మరో 13 మంది అధికారుల గుట్టును అధికారులు రట్టు చేశారు. 23 చోట్ల ఆకస్మిక తనిఖీలు జరిపారు. 20 క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు రిజిష్టర్ చేశారు. ఈ క్రమంలో ఔట్ సోర్సింగ్ పై పని చేస్తున్న 15మందితో కలిపి మొత్తం 189మంది ప్రభుత్వ ఉద్యోగులను కటకటాల వెనక్కి పంపించారు. ట్రాప్ చేసి పట్టుకున్న కేసుల్లో అధికారుల నుంచి 42లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో 58.36 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. ప్రైవేట్ మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ ఆస్తుల విలువ 15వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
శిక్షలు పడేలా..
ఇక, కేవలం కేసులు నమోదు చేయటమే కాకుండా నిందితులకు శిక్షలు పడేలా కూడా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఎవరైనా అధికారి రెడ్ హ్యాండెడ్ గా దొరికినా.. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టుగా నిర్ధారణ అయినా ఆ కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలను పక్కగా సేకరిస్తున్నారు. పకడ్భంధీగా ఛార్జీషీట్లు తయారు చేసి కోర్టులకు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే కేసుల్లో శిక్షల శాతం కూడా పెరగటం గమనార్హం.
ఇక ముందు కూడా..
అవినీతికి పాల్పడే అధికారుల ఆట కట్టించటానికి ఇక ముందు కూడా చర్యలు కొనసాగుతాయని ఏసీబీ డీజీ చారూ సిన్హా చెప్పారు. ఏ ప్రభుత్వ ఆఫీసులోనైనా…ఏ అధికారి అయినా అధికారికంగా సాయ పడేందుకు లంచం అడిగితే 1064 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. దాంతోపాటు acb@ap.gov.in అన్న ఐడీకి మెయిల్ చేసి సమాచారం ఇవ్వొచ్చని పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.
Also Read: Ram Charan: ‘పెద్ది’ కోసం వాటిని పక్కన పెట్టిన రామ్ చరణ్.. అయినా పర్లేదా?
