Police Training Centre: వృత్తిని దైవంగా భావించి విధులు నిర్వర్తించాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, అదనపు డీజీ వీ.వీ.శ్రీనివాస రావు అన్నారు. శాంతిభద్రతలను సమర్థవంతంగా కాపాడేందుకు అంకిత భావంతో పని చేయాలన్నారు. ప్రజలకు భద్రత కల్పించినపుడే వారిలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. మేడ్చల్ కండ్లకోయలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ మంగళవారం జరిగింది.
దీనికి ముఖ్య అతిధిగా హాజరైన అదనపు డీజీ శ్రీనివాస రావు మాట్లాడుతూ పోలీస్ వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. క్రమశిక్షణతో పని చేసి వీటిని అధిగమించాలని చెప్పారు. తెలంగాణ పోలీసు శాఖ దేశానికే దిక్సూచిగా ఉందన్నారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించినట్టు చెప్పారు.
ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్, ఎస్పీ మధుకర్ స్వామీ మాట్లాడుతూ తొమ్మిది నెలల కఠోర శిక్షణ తీసుకున్న కానిస్టేబుళ్లు అందరూ విధుల్లో చేరిన తరువాత క్రమ శిక్షణ, నైతిక విలువలతో పని చేయాలన్నారు. తద్వారా రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టను మరింతగా ఇనుమడింప చేయాలని చెప్పారు. అనంతరం ట్రైనింగ్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ఫౌంటెయిన్లు, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్, సీసీటీవీలను అదనపు డీజీ శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ గూడ బెటాలియన్ కమాండెంట్ పీ.మురళీ కృష్ణ, ట్రైనింగ్ కాలేజీ డీఎస్పీలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు