- అక్రమార్జనకు నిలయంగా మారిన ‘మీ సేవ ’ కేంద్రం
- ఎస్ టీ పీ ఆపరేటర్-2 పేరుతో లాగిన్
- రాంగ్ రూట్ లో సర్టిఫికెట్ల జారీ
- ఎమ్మార్వో లాగిన్ ఐడి నుంచి ఆయన సంతకాలతో సర్టిఫికెట్లు జారీ
- వేర్వేరు ఫోన్ నంబర్లతో మోసాలు
- రూ.50 వేలనుంచి 5 లక్షల దాకా అప్లికెంట్ల నుంచి వసూళ్లు
- కులం, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్లకు భారీగా వసూళ్లు
- డీటీపీ ఆపరేటర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసులు నమోదు
- పరారీలో నిందితులు..మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు
- రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’ సెంటర్లపై నిఘా
Telangana Mee Seva centres illigal issue of certificates from applicants:
అక్కడ ఎడాపెడా కులం, ఆదాయ సర్టిఫికెట్లు బహిరంగంగా దొరుకుతాయి. లంచం ఇస్తే చాలు కులం మారిపోతుంది. ముడుపులు చెల్లిస్తే చాలు ఆదాయం తగ్గించి సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. సాంకేతిక పరిజ్ణానం ఎక్కవైపోయి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల ఎమ్మార్వో ఆఫీసు అక్రమార్కులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రాంగ్ రూట్ లో సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తూ భారీ స్కామ్ కు పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా ఎస్ టీ పీ ఆపరేటర్-2 పేరుతో లాగిన్ అయి మూడు వేర్వేరు ఫోన్ నెంబర్లతో భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారు. ఎమ్మార్వో లాగిన్ ఐడీ నుంచి ఆయన సంతకాల వరకూ ఈ టెక్నాలజీని విచ్ఛలవిడిగా వాడుకున్నారు.
వెయ్యికి పైగా సర్టిఫికెట్ట జారీ
ఇప్పటిదాకా సుమారు వెయ్యికి పైగా స్థానికేతరులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేశారని సమాచారం. . ఫీజ్ రియంబర్స్మెంట్ , స్కాలర్ షిప్, ప్రభుత్వ పథకాలకు అడ్డదారిలో సర్టిఫికేట్లు మంజూరు చేయడమే వీరి ప్రత్యేకత. కొంతమంది నిందితులు ఓ గ్యాంగ్ గా ఏర్పడి హైదరాబాద్ లోని పలు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయిస్తూ అక్రమార్జనలకు పాల్పడుతున్నారు. అర్జీదారులు లేకుండానే సర్టిఫికెట్లు విడుదల చేయడం..సంబంధిత సర్టిఫికెట్లను సీక్రెట్ గా ఇంటికే పంపించడం వంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఇందుకు గాను దరఖాస్తుదారులనుంచి అడ్డగోలుగా దండుకున్నారు. సదరు ఈ గ్యాంగ్ కొంత మంది బ్రోకర్టను మీ సేవా సెంటర్ల వద్ద కాపుగాయించి సర్టిఫికెట్లు కావలసిన వారికి ఒక్కో దానికి ఇంత చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ వాల్యూను బట్టి రూ.50 వేల నుంచి 5 లక్షల దాకా వసూళ్లకు పాల్పడినట్లు తెలిసంది.అయితే ఈ వ్యవహారం అంతా వీఆర్ఏ, డీటీ, ఆర్ ఐ వంటి అధికారుల ప్రమేయం లేకుండానే గుట్టచప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. రెండేళ్లుగా ఈ వ్యవహారాన్ని ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు. ఇప్పటిదాకా వెయ్యికి పైగా సర్టిఫికెట్లు జారీ చేసి భారీగా సొమ్ములు అందిపుచ్చుకున్నట్లు తెలిసింది. ఇక తహశీల్దార్ కు సంబంధించి డిజిటల్ కీ సంతకంతో వందల సంఖ్యలో అనునిత్యం సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తూ అందినకాడికి సొమ్ము చేసుకున్నారు.
భారీ స్కామ్ గుర్తింపు
రంగారెడ్డి జిల్లా మైనార్టీ కార్యాలయం నుంచి మండల కార్యాలయానికి ఈ అక్రమాలపై ఆకాశ రామన్న ఉత్తరం రావడంతో స్వయంగా అధికారులు రంగంలోకి దిగారు. భారీ స్కామ్ నిజమేనని గుర్తించారు. దీనితో నిందితుల గుట్టు రట్టయింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా రెండేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా నిందితులు జరిపిన స్కామ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అయితే ఈ నిందితుల వద్దకు వచ్చిన వారంతా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం. మీ సేవా కేంద్రాలలో కుప్పలుగా అప్లికేషన్లు పడివుండటంతో పరిశీలనకు వచ్చిన ఎమ్మార్వో కార్యాలయ అధికారులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. తమ ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని ఉలిక్కిపడ్డ అధికారులు జరిగిన భారీ స్కామ్ పై మంచాల పరిధిలోని పోలీస్ స్టేషన్లో రంగారెడ్డి ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు. ఈ భారీ స్కామ్ కు పాల్పడ్డ కంప్యూటర్ ఆపరేటర్ ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సాయంతో ఈ అక్రమాలకు పాల్పడ్డాడని తేలడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిద్దరిపై 420, 409 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు పోలీసులు. కాగా వీరి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారో? వారి పాత్ర ఏమిటో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఈ విషయం బయటకు తెలిస్తే తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని భయపడుతున్నట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి ఎమ్మార్వో పరిధిలోని మీ సేవలో జరిగిన అక్రమాలు మాదిరిగా రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ మీ సేవా సెంటర్లలో ఇలాంటివి జరుగుతున్నాయో అని ఎంక్వైరీ చేస్తున్నారు. లోతుగా వెళితే మరిన్ని మీ సేవ అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉంది.