CM Revanth Reddy: గత అనుభవాల నుంచి భవిష్యత్ తరాలకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో పాలసీ డాక్యుమెంట్ తయారు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. (CM Revanth Reddy) గ్లోబల్ సమ్మిట్పై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ తెలంగాణ 2047 బ్రోచర్ను రిలీజ్ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని, గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్ను ప్రకటిస్తామని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీ ద్వారా మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
విజన్ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047గా పిలుస్తున్నామన్నారు. అందులో విజన్, స్టాటజీ అనే రెండు అంశాలు ఉన్నట్లు తెలిపారు. విజన్ డాక్యుమెంట్లో లక్షలాది మంది భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. నీతి అయోగ్, ఐఎస్బీ లాంటి సంస్థల సహకారంతో డాక్యుమెంట్ను తయారు చేస్తున్నామన్నారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించామని, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని మొత్తం ప్రణాళిక బద్ధమైన అభివృద్ది కోసం కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా చూస్తున్నామని స్పష్టం చేశారు.
కాలుష్య రహిత సిటీగా మార్చడం కోసం
మెట్రోపాలిటన్ సిటీలు ప్రస్తుతం కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోర్ అర్బన్ రీజన్ను సర్వీస్ సెక్టర్గా మారుస్తున్నామని పేర్కొన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను కోర్ అర్బన్ రీజన్ నుంచి తరలిస్తున్నామని తెలిపారు. కోర్ అర్బన్ రీజన్లో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతలి భాగంలో రీజినల్ రింగ్ రోడ్లు రాబోతున్నాయని, రీజినల్ రింగ్ రోడ్లు 360 కిలోమీటర్ల దూరం ఉండనున్నదని పేర్కొన్నారు. పెరి అర్బన్ రీజనల్ ఎకానమీగా దీన్ని పిలుస్తామని వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు అనేకం ఈ రీజినల్లో ఉండబోతున్నాయని స్పష్టం చేశారు.
హైవే, పోర్ట్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటి
గ్రీన్ ఫీల్డ్ హై వే, బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్కడ రాబోతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఇంకా ఎయిర్పోర్టులు రావాల్సి ఉన్నదన్నారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్పోర్టులు తీసుకురాబోతున్నట్లు సీఎం తెలిపారు. హైవే, పోర్ట్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటి వల్ల పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు మూడో రీజియన్గా చూస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రైతులను భాగస్వాములు
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి బాగా అనుకూలమని, క్యూర్, ప్యూర్, రేర్లా తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తున్నామన్నారు. ఈ మూడింటిని క్రోడికరించి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యూమెంట్ ఉండబోతుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. దేశానికి అవసరమైన దానికంటే అహారధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. కానీ, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నామని, అందరికి విద్య అందుబాటులో ఉన్నప్పటికి నాణ్యమైన విద్య, సాంకేతిక విధ్య అందుబాటులో లేదన్నారు. అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేస్తామన్నారు.
త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమిగా తీర్చిదిద్దడమే లక్ష్యం
2034కి వన్ ట్రిలియన్, 2047కి త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. దేశంలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తమ దార్శనికతనే భవిష్యత్తు ప్రణాళికలు అని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అనేక మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నామనీ, ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో వార్ రూం ఏర్పాటు చేశామన్నారు. చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ తమకు రోల్ మోడల్ అని, వాళ్లనే ఆదర్శంగా తీసుకుని పోటీ పడతామన్నారు. ఆంధ్రా, తమిళనాడు, మరో రాష్ట్రం పోటీ కాదన్నారు. విదేశాల నుంచి నేరుగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు.
Also Read: CM Revanth Reddy: గ్లోబల్ సమ్మిట్కు మోదీని ఆహ్వానించాలి: సీఎం రేవంత్ రెడ్డి
