– శాసన మండలిలో సందడి వాతావరణం
– ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్
– కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రాకతో హడావుడి
Teenmar Mallanna: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో విజయం సాధించిన తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్తిని రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్న మాట్లాడుతూ, తాను ఇప్పటి వరకు ఏ పదవీ చేపట్టలేదని, తొలిసారిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచానని చెప్పారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు ఓటేసిన గ్రాడ్యుయేట్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, బాధ్యతాయుత వ్యక్తిగా ఇకపై ఉంటానని వివరించారు. పట్టభద్రుల గళాన్ని శాసన మండలిలో వినిపిస్తానని తెలిపారు.
ఇక, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డితోనూ శాసన మండలి చైర్మన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు హాజరయ్యారు. తన గెలుపులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధుల పాత్ర ముఖ్యమైనదని నవీన్ కుమార్ వివరించారు. జూన్ 2న తాను గెలవడంతో ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు.