- క్రితం కంటే రెట్టింపునకు మించి సీట్లు
- ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ బెస్ట్ రికార్డు
- లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయాల నమోదు
- నల్గొండ నుంచి సుమారు 5 లక్షల ఓట్లతో రఘువీర్ వీరవిహారం
- అసెంబ్లీ ఎన్నికల దూకుడు కొనసాగించిన హస్తం
- రేవంత్ పాలనే రెఫరెండం.. పార్టీకి సత్ఫలితాలు
- కలిసొచ్చిన సంక్షేమ పథకాలు
T.congress continue to success Assembly results 8 seats got lok sabha elections:
ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రికార్డులు సృష్టిస్తున్నది. రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. అదే దూకుడును పార్లమెంటు ఎన్నికల్లోనూ కొనసాగించింది. పార్లమెంటు సీట్ల సంఖ్యను రెట్టింపు కంటే కూడా పెంచుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ మూడు సీట్లను గెలుచుకుంటే.. ఈ సారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 8 సీట్లను కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్కు ఇదే ది బెస్ట్ రికార్డ్. 2014 పార్లమెంటు ఎన్నికల్లో నాగర్కర్నూల్, నల్గొండ సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2019లో ఒక స్థానాన్ని అదనంగా పెంచుకుని.. నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఏకంగా 8 సీట్లను గెలుచుకుంది.
విజయాల్లోనూ రికార్డులే
కాంగ్రెస్ చాలా చోట్ల రికార్డు మార్జిన్లతో విజయాన్ని నమోదు చేసింది. అత్యధికంగా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి 5 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ఘన విజయాన్ని నమోదు చేశారు. ఇక ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డి కూడా 4 లక్షలకు పైగా ఓట్లతో అద్భుత విజయాన్ని పొందారు. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ 3 లక్షలకుపైగా ఓట్లతో గెలుపు కైవసం చేసుకున్నారు. వరంగల్ నుంచి కడియం కావ్య, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిలు 2 లక్షలకు మించిన ఓట్లతో విజయం సాధించారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ లక్షకుపైగా ఓట్లతో గెలిచారు. నాగర్ కర్నూల్ నుంచి డాక్టర్ మల్లు రవి, జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కార్లు కూడా భారీ మార్జిన్లతో గెలుపొందారు.
5 లక్షల ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థులు కుందూరు రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డిలు ఘన విజయాన్ని నమోదు చేశారు. సుమారు 5 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ నుంచి రఘువీర్ భారీ మెజార్టీతో గెలువగా.. ఖమ్మంలో మాత్రం బీఆర్ఎస్ సీనియర్ లీడర్, సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుపై రామసహాయం రఘురాం రెడ్డి అపూర్వ విజయాన్ని నమోదు చేశారు. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం మంత్రులు పొంగులేటి, భట్టి మధ్య ఒకానొక దశలో పోటీ ఏర్పడింది. చివరికి అధిష్టానం రఘురాం రెడ్డికి టికెట్ కేటాయించింది. ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు కలిసికట్టుగా పని చేసి రఘురాం రెడ్డి భారీ విజయానికి దోహదపడ్డారు. ఇక ఆయన వియ్యంకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ స్పెషల్ ఎఫర్ట్ పెట్టారు.
రేవంత్ పాలన ప్లస్సు
రేవంత్ సారథ్యంలో పుంజుకున్న టీకాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి వెంటవెంటనే అమల్లోకి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు బంధు, ఉచిత కరెంట్ వంటివి కాంగ్రెస్ పై సానుకూల అభిప్రాయాన్ని ప్రజల్లో పెంచాయి. ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేసి.. రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా తప్పకుండా అమలు చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. సంక్షేమ పథకాలను అమలు చేసి రేవంత్ రెడ్డి ప్రజల్లో నమ్మకాన్ని నిలుపుకున్నారు. ఫలితంగా రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో చేసిన హామీని ప్రజలు విశ్వసించారు. రేవంత్ రెడ్డి సుపరిపాలనే రెఫరెండంగా పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ సత్ఫలితాలను రాబట్టింది.
ఫస్ట్ టైం విన్నర్స్
ఈ ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నవారి సంఖ్య ఎక్కువే ఉన్నది. కాంగ్రెస్ నుంచి ఘన విజయం సాధించిన జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య తొలి విజయాలను అందుకుని పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. బీజేపీలోనూ ఫస్ట్ టైం విన్నర్లు ఉన్నారు. మాధవనేని రఘునందన్ రావు, ఈటల రాజేందర్లు గతంలో శాసన సభలో అడుగపెట్టారు. ఇప్పుడు తొలిసారిగా పార్లమెంటు గడపతొక్కనున్నారు.