– మరోసారి రోడ్డెక్కిన మల్లారెడ్డి వర్సిటీ విద్యార్థులు
– భోజనంలో పురుగులు ఉన్నాయంటూ ఆందోళన
– యూనివర్సిటీ ముందు ధర్నా
– ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం
– విద్యార్థులకు అండగా ఎన్ఎస్ యూఐ నేతలు
– లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సరైన భోజనం పెట్టరా అంటూ ఫైర్
Mallareddy Educational Institutes: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి నెగెటివ్ వార్తలు పెద్దగా చూసింది లేదు. పార్టీ అధికారంలో ఉండడం, మల్లారెడ్డి మంత్రిగా కొనసాగడంతో ఆడిందే ఆటగా సాగింది. కానీ, ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన ఆగడాలకు చెక్ పడింది. అధికారులకు ధైర్యం వచ్చింది. కబ్జాలపై కొరడా ఝులిపిస్తున్నారు. విద్యార్థుల్లో ధైర్యం పెరిగింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో ధర్నాలకు దిగుతున్నారు. ఇన్నాళ్లూ ఏం పెట్టినా సైలెంట్గా తినేసిన విద్యార్థులు, ఇప్పుడు నిరసన స్వరాన్ని వినిపిస్తున్నారు.
ఆహారంలో పురుగులు, ప్లాస్టిక్
మల్లారెడ్డి యూనివర్సిటీలో నాణ్యమైన ఆహారం అందడం లేదని మరోసారి విద్యార్థులు ధర్నాకు దిగారు. గురువారం రాత్రి భోజనంలో పురుగులు, ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయంటూ శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, గతంలో అనేకమార్లు ఇలాగే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు బాసటగా ఎన్ఎస్ యూఐ నేతలు
నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఎన్ఎస్ యూఐ నేతలు మద్దతు తెలిపారు. వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళనలు చేశారని, అయినా యాజమాన్యం తీరులో మార్పు రాలేదని మండిపడ్డారు. గతంలో మల్లారెడ్డి నాణ్యమైన భోజనం ఇస్తామని చెప్పినా, కొద్ది రోజులకే అది పరిమితం అయిందన్నారు.