– ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నారు
– తెలంగాణలో బొగ్గు గనుల వేలం ఎందుకు?: కొప్పుల
Koppula Eswar: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసే సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇందుకోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని ఎన్నికలకు ముందు చెప్పిన మోదీ.. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహించారు. తెలంగాణ నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించామని, సింగరేణిని కాపాడతారని అనుకున్నామని, కానీ, అలా జరగడం లేదన్నారు. సింగరేణి ఒక సంస్థ మాత్రమే కాదు.. ఈ ప్రాంతం కొంగు బంగారం అని, లక్షలాది మందికి ఉపాధినిస్తున్న సంస్థ అని చెప్పారు.
కేంద్రం, రాష్ట్ర భాగస్వామ్యంతో సింగరేణి నడుస్తున్నప్పటికీ కేసీఆర్ చొరవతో లాభాల్లోకి వచ్చిందని, కానీ, లాభాలు గడిస్తున్న సింగరేణిని ప్రైవేటుపరం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఎవరి కోసం సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నారని అడిగారు. ఒడిశా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని బొగ్గు గనులను ఆయా రాష్ట్రాలకు కేటాయించారని, మరి తెలంగాణలో మాత్రం సింగరేణి బొగ్గు గనులను ఎందుకు వేలం వేస్తున్నారని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం కోరినా ఎందుకు కేటాయించలేదని ఫైర్ అయ్యారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సింగరేణి కోల్ బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకించారని, ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే తన డిప్యూటీని సింగరేణి వేలం ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొనడానికి పంపించారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బొగ్గు నిల్వలను కనుగొనేందుకు సింగరేణి వందల కోట్లు ఖర్చు చేసిందని, ప్రైవేటు సంస్థలు వస్తే రిజర్వేషన్లు పోతాయని, పేదలు, దళితులు హక్కులు కోల్పోతారని చెప్పారు. సింగరేణి పరిధిలోని వేలంలో పెట్టిన శ్రావనపల్లి బ్లాక్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.