– పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు సినిమా ఉంటుంది
– గతంలో జరిగిన స్కాములన్నీ బయటకు వస్తాయి
– సంబంధించిన వాళ్లంతా జైలుకు పోవడం ఖాయం
– మల్లన్న సాగర్ కుంభకోణాల చిట్టా విప్పుతాం
– బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమల్లో ఉన్నారు
– నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు
– మైనంపల్లి హన్మంతరావు ఆగ్రహం
Mynampally Sensational Comments About BRS Leaders: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబానికి నిద్ర ఉండదని హెచ్చరించారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని అంతాయిపల్లిలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సభా స్థలాన్ని పరిశీలించారు. కేసీఆర్ హయాంలో జరిగిన స్కాములన్నీ బయటకు వస్తాయని చెప్పారు. అంతేకాదు, ఆయా స్కాముల్లో సహకరించిన వారందరికీ జైలు తప్పదని హెచ్చరించారు. ప్రజాగ్రహానికి గురైన కేసీఆర్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, అలాంటి వ్యక్తిని నమ్మి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారని సెటైర్లు వేశారు.
మల్లన్న సాగర్ కుంభకోణాల చిట్టా విప్పుతామని, నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని బయటపెడతామన్నారు మైనంపల్లి. ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమల్లో కొందరు బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, కాంగ్రెస్కు 15 సీట్లు పక్కాగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను గౌరవిస్తుందని, మల్కాజ్ గిరిలో పోటీ చేస్తున్న మహిళను ఢిల్లీకి పంపించాలని ప్రజలను కోరారు. ఆమెను ఎంపీగా గెలిపిస్తే, అభివృద్ధి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు. దళిత బంధు పేరుతో కేసీఆర్ కొందరు బీఆర్ఎస్ వాళ్లకే డబ్బులు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్, మోసం చేశారని అన్నారు మైనంపల్లి హన్మంతరావు.