Politics, Top Stories

Delhi : మారిన స్వరం.. దూరమేనా అధికారం..!?

– మొదట్లో 400 సీట్లు అన్నారు
– తర్వాత 370కి వచ్చారు
– ఇప్పుడేమో మెజార్టీ మాటలు నిల్
– వ్యక్తిగత దూషణలు ఫుల్
– కాంగ్రెస్, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు
– ఏ రాష్ట్రానికి వెళ్లినా అతిగా వ్యక్తిగత విమర్శలు
– రెండు దశల పోలింగ్ తర్వాత మారిన మోదీ స్వరం

Modi changed strategy after two stages of polling: మొదటి, రెండవ దశల పోలింగ్ సరళితో మోదీకి మెజారిటీ స్థానాలపై భయం పట్టుకుందా? అందుకే, ఆయన స్వరం పూర్తిగా మారిపోయిందా? అంటే, అవుననే సమాధానం ప్రతిపక్షాల నుంచి వస్తోంది. అంతకుముందు దాకా 370 ఆర్టికల్ రద్దు చేసింది తామేనని, రాముడికి గుడి కట్టించామని, సర్జికల్ స్ట్రైక్‌తో పాక్‌ను దారిలోకి తెచ్చామని, సంక్షేమ పథకాలనూ ప్రచారం చేసుకొచ్చిన మోదీ, ఒక్కసారిగా కాంగ్రెస్‌ను, ఆ పార్టీకి అండదండగా ఉన్న ముస్లిం వర్గాలను టార్గెట్ చేయడం కనిపిస్తోంది. మోదీ కలలు కంటున్నట్టుగా మెజార్టీ సంగతి పక్కన పెడితే అసలు అధికారంలోకి వస్తుందా రాదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, యూపీ (80 స్థానాలకు గాను 75 చోట్ల) రాష్ట్రాల్లో మొత్తం స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఈ రాష్ట్రాలతోపాటు గత ఎన్నికల్లో కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్‌, పంజాబ్‌, ఢిల్లీలో మెజారిటీ స్థానాలను, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మెరుగైన స్థానాలను దక్కించుకున్నది. కానీ, ఈసారి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎదురీదే పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. దీంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ కీలక మార్పులతో, కర్ణాటకలో జేడీఎస్‌తో, బిహార్‌లో జేడీయూతో, ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు ద్వారా మెజారిటీ మార్క్‌ను చేరుకోవడానికి యత్నిస్తున్నది.

దక్షిణాది రాష్ట్రాలపై నజర్

సౌత్‌లో ఇండియా కూటమి ప్రభంజనం కనిపిస్తోంది. నార్త్‌లో ఎదురుగాలి వీస్తుండడంతో ఎలాగైనా సౌత్‌లో పాగా వేయాలని మోదీ భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అధికారం దక్కించుకుని మిగిలిన రాష్ట్రాలలో కూడా మోదీకి ఝలక్ ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్. మోదీ కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాస్ట్రాలలో ఎక్కువ సీట్లపై కన్నేశారు. అయితే, జరిగిన రెండు దశల పోలింగ్‌లో వ్యతిరేక పవనాలు వీచాయన్న రిపోర్టులు అందడంతో మోదీ స్వరం మారినట్టుగా చెబుతున్నారు. కర్ణాటకలో అమలవుతున్న 27 శాతం ఓబీసీ కోటాలోకి ముస్లింలను చేర్చడంపై స్పందిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ముస్లింలకు ఇలాంటి అవకాశమే ఇస్తుందనే ప్రచారం మొదలుపెట్టారు. మహారాష్ట్రాలో ఉద్దవ్ థాక్రే ప్రభంజనంలో ఈసారి బీజేపీకి భారీగా డ్యామేజ్ జరగనుందని సమాచారం. అందుకే, మరోసారి హిందూత్వ భావాలను నెత్తినెక్కించుకున్నారు మోదీ. ఉద్దవ్‌ను ఔరంగజేబుతో పోల్చి మహారాష్ట్ర ఓటర్లను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన కమలనాథులకు కాంగ్రెస్, ఆప్ అలయెన్స్ సవాల్ విసురుతున్నది. అందుకే, ఇండియా కూటమిలో సంక్షోభం సృష్టించే ఎత్తుగడలో భాగంగానే కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనికితోడు తన మాటలతో హిందూవుల్లో సెంటిమెంట్ రగిలించి లబ్ది పొందాలనే ప్లాన్ చేసినట్టు మోదీ మాటలను బట్టి అర్థం అవుతోందని అంటున్నారు.

రిజర్వేషన్లపై రెండు నాల్కల ధోరణి

తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనుకుంటున్న కాంగ్రెస్.. బీజేపీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, అది ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అని ప్రచారం చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాట్లాడినట్టు ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇది తమ ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతీస్తుందో అని ఆయనతో హైదరాబాద్‌లో మీటింగ్‌ పెట్టించి తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెప్పించినట్టుగా మాట్లాడుకుంటున్నారు. రిజర్వేషన్ల అంశం అన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తుందని తెలిసే కాంగ్రెస్‌ పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అనేకసార్లు కామెంట్స్‌ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీకి ఇబ్బందిగా మారిన ఈ అంశాన్ని అధిగమించడానికి ప్రధాని, అమిత్‌ షా ఆపసోపాలు పడుతున్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన నష్టం మూడో దశలోనూ జరిగే అవకాశం ఉందని గ్రహించి ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమిపై ఎదురుదాడి చేస్తున్నది బీజేపీ. దీనిపై స్పందించిన అఖిలేశ్‌ యూపీలో రిజర్వేషన్లు తొలిగించిన బీజేపీ ఇప్పుడు వాటిని ఎవరు తొలగించినా ఊరుకోబోమని నిస్సిగ్గుగా చెబుతున్నదని, ఈ విషయాన్ని ఓటర్లు నిలదీయాలని పిలుపునిచ్చారు. తప్పుడు ప్రకటనలు యూపీ ఓటర్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తాయని, మూడో దశలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న వారిని ప్రజలే మార్చేస్తారని ఆయన సెటైర్లు వేశారు.

కాంగ్రెస్, ముస్లింలే టార్గెట్

మూడో దశ ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్నకొద్దీ ఆందోళనలో ఉన్న కమలనాథులు ప్రచారశైలిని పూర్తిగా మార్చేశారు. 370 రద్దు గురించి మాట్లాడం లేదు. 370 సీట్ల గురించి ప్రస్తావించడం లేదు. రామ మందిర నిర్మాణం ఊసెత్తడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ప్రచారం చేస్తున్నారు. విపక్ష కూటమికి మూడంకెలూ కష్టమే అంటున్న ప్రధానికి సొంతంగా అధికారానికి అవసరమైన మెజారిటీ రాదని అర్థమైందని, అందుకే ఆయనతో సహా ఆ పార్టీ కీలక నేతలంతా ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీని నిందించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఇంత చేసినా బీజేపీ ఆశిస్తున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!