తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఎమ్మెల్యే కోటా (MLA Quota) ఎమ్మెల్సీలకు(MLC) కాంగ్రెస్ లో (Telangana Congress) పుల్ కాంపిటిషన్ నెలకొన్నది. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ యువ నాయకుల దగ్గర్నుంచి సీనియర్ నేతల (Senior Leaders) వరకు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో పెద్దల సభలో (Legislative Council) ఈజీగా అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం (CM Revanth Reddy) నుంచి మొదలు కొని ఢిల్లీ లెవల్లో పైరవీల్లో నిమగ్నమయ్యారు. ఈ కోటాలో సులువుగా చట్ట సభలో అడుగు పెట్టవచ్చనే అభిప్రాయం అందరు నేతల్లో ఉన్నది. దీంతోనే భారీ కాంపిటిషన్ ఏర్పడింది. మార్చి లోపు భర్తీ చేయాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఆశావహులంతా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పీసీసీ చీఫ్, సీఎంపై ఒత్తిడి పెంచుతున్నారు. మరికొందరు నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ చేశారని సమాచారం. క్యాస్ట్ ఈక్వేషన్స్, స్టేట్ వైడ్ స్టేచర్, పార్టీకి లాయల్ అనే అంశాలను పరిగణలోకి తీసుకొంటే తమకు పక్కగా సీటు లభిస్తుందని కొందరు నేతలు ఆశతో ఉన్నారు. అయితే హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గాంధీభవన్తోపాటు జిల్లా స్థాయిలో కొందరు నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నది. ఇటీవల రేసులోని కొందరి నేతల పేర్లను టీపీసీసీ ఢిల్లీకి పంపించినట్లు సమాచారం. ఏఐసీసీ పూర్తి స్థాయిలో పరిశీలన తర్వాత క్యాండిడేట్లను ప్రకటించనున్నది.
రేసులో వీరే?
ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ (Addanki Dayakar), రెడ్డి సామాజిక వర్గం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దాదాపు వీరికి టిక్కెట్లు కన్ఫామ్ అని పార్టీ లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఇక బీసీ కోటాలో ఉస్మానియా విద్యార్థి నేత , టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ పేరు వినిపిస్తున్నది. ప్రజలతో సంబంధాలు, పార్టీ కోసం నిత్యం చేస్తున్న ఫైట్, అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాకపోవడం వంటి అంశాలను ప్రధానంగా తీసుకొని ఎంపిక చేస్తే ఈ ముగ్గురికీ మండలిలో బెర్తులు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పైగా రాహుల్ గాంధీ కూడా కర్ణాటకలో సీడబ్ల్యూసీ తీర్మానం, పార్టీకి ఇరవై ఏళ్ల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని పదవులు ఇస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. వీటిని సీరియస్గా కన్సిడర్ చేస్తే మూడు స్థానాలకు అభ్యర్ధులు ఫిక్స్ అయినట్లేనని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఇటీవల కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన గాంధీభవన్లో జరిగిన పీఏసీ మీటింగ్లోనూ యూత్కే ప్రాధాన్యం అంటూ తీర్మానం చేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తే ఈ ముగురు నేతలకు పక్కగా చాన్స్ లభిస్తుందని స్టేట్ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవులు తీసుకున్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, రాజ్య సభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్లకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కూడా హైకమాండ్ ఇదే రూల్ పాటిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
మాకూ ఇవ్వాల్సిందే..
తనకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) కోరుతున్నారు. ఎమ్మెల్యే కోటా కోసమే గ్రాడ్యుయేట్ (Graduate MLC) టిక్కెట్ వదులుకున్నానని వివరిస్తున్నారు. అయితే ఈయన అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ టిక్కెట్పై పోటీ చేయడం గమనార్హం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్పై పోటీ చేసిన మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, సునీతారావు, షబ్బీర్ అలీ కూడా ట్రై చేస్తున్నారు. కానీ వీరికి పదవులు ఇస్తే మిగతా నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది పార్టీకి సవాల్గా మారింది. ఇటీవల మధుయాష్కీ గౌడ్ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిశారు. ఎమ్మెల్సీ పోస్టు కోసమే అంటూ గాంధీభవన్ లో ప్రచారం జరుగుతున్నది. సీనియర్లకు ఎమ్మెల్సీలు ఇవ్వడంతో ఆ తర్వాత ఆటోమెటిక్ గా మంత్రి పదవి రేసులో ఉంటారనే చర్చ కూడా పార్టీలో జరుగుతున్నది. ప్రస్తుతం ఖాళీ కానున్న ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలు కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే చాన్స్ ఉన్నందున బంపర్ ఆఫర్ కోసం నేతలు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్లు తీసుకున్నోళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో అవకాశం ఇవ్వొద్దని జూనియర్ నేతలు కోరుతున్నారు. దీని వలన పార్టీ డిస్టర్బ్ అవుతుందని, పార్టీ శ్రేణులు, క్యాడర్కు తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉన్నదని కొత్త నేతలు వివరిస్తున్నారు. దీంతో ఒకవైపు సీనియర్లు, మరోవైపు జూనియర్లు (కొత్త నేతలు)పెట్టిన ప్రపోజల్స్పై పార్టీ తర్జన భర్జన పడుతున్నది. ఈ రెండు వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుటుందో వెయిట్ చేయాలి.