Teenmar Mallanna: జూబ్లిహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలు కలుసుకున్నారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అభినందించారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగి సత్తా చాటిన ఈ నాయకులను శాలువా కప్పి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కూడా వారితో ఉన్నారు.
భువనగిరి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. గెలిచిన తర్వాత ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా, సీఎం రేవంత్ నివాసంలో మంత్రి తుమ్మల ఆయనను సన్మానించారు. ఇక ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బరిలో దిగారు. ఫలితాల వేళ ఈ ఉపఎన్నిక ఉత్కంఠను రేపింది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం తేలలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి తీన్మార్ మల్లన్న గెలుపును అధికారులు ప్రకటించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
సీఎంతో రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్:
తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులు మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రిటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్లు సీఎంను కలిసి రెరా చట్టం గురించి చరర్చించారు. రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ చట్టం అమలు ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా చట్టాన్ని అమలు చేయాలని చెప్పారు.
డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న తెలంగాణ కేడర్కు చెందిన 2023 ఐఏఎస్ బ్యాచ్ అసిస్టెంట్ కలెక్టర్లతోనూ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో భేటీ అయ్యారు.