– ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు
– వైకల్యం ఉందని కుంగిపోవద్దు
– హెలెన్ కెల్ర్ను స్ఫూర్తిగా తీసుకోవాలి
– సాయం చేయనివారు నిజమైన వికలాంగులు
– రవీంద్రభారతిలో మంత్రి సీతక్క
Handicapped: వికలాంగుల ఉపకరణాల కోసం ఈ ఏడాది రూ. 75 కోట్ల నిధులు మంజూరు చేశామని, అన్ని ఉద్యోగాల్లో వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పించామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క వెల్లడించారు. ఉన్నత విద్య, సంక్షేమ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన హెలెన్ కెల్లర్ జయంత్యుత్సవాల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను, లాప్టాప్లను పంపిణీ చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేక వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఇంటి నుంచే మీసేవ సేవలను వినియోగించుకునేలా ఈ సైట్, యాప్ ఉంటుంది. అలాగే.. ప్రత్యేకంగా జాబ్ పోర్టల్ను ఏర్పాటు చేశామని సీతక్క తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ.. హెలెన్ కెల్లర్ జయంతిని మనందరి పుట్టిన రోజులా వేడుక చేసుకోవాలన్నారు. వైకల్యాన్ని జయించి దివ్యాంగుల ఉద్యమ సారథిగా నిలిచిన హెలెన్ కెల్లర్ జీవిత స్ఫూర్తిని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. వైకల్యం ఉందని ఎవరూ కుంగిపోవద్దని, హెలెన్ కెల్లర్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. ఆమె కృషి వల్లే నేటికీ ప్రపంచం గుర్తుంచుకుంటుందని, వైకల్యానికి ఆమె ఏనాడూ లొంగలేదని పేర్కొన్నారు. ఇతరుల బాధ గురించీ పోరాడారని, అందుకే ఇంత ఆదరణ ఉన్నదని వివరించారు. హక్కుల కార్యకర్తగా, లాయర్గా, రచయిత్రిగా ఆమె బహుముఖ ప్రజ్ఞాశీలి అని చెప్పారు. సాటి మనిషికి సాయం చేయలేనివారే నిజమైన వికలాంగులని పేర్కొన్నారు.