– నిర్వహణ లోపాలపై ఆగ్రహం
– ప్రైమ్ లొకేషన్లో ఉన్నా ఆదాయం అంతగా లేదు
– ప్రైవేటు హోటల్స్కు దీటుగా నిర్వహిస్తాం
– ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే ధ్యేయం: మంత్రి జూపల్లి
haritha Resorts: ఎన్నికల కోడ్ ముగియగానే తెలంగాణ మంత్రులు తమ తమ శాఖలపై ఫోకస్ పెంచారు. నిన్నటి నుంచి ఉచిత కరెంట్ బిల్లు కల్పించే గృహ జ్యోతి పథకం అమలు అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఈ రోజు ఆయన హరిత తారామతి బారదారి రిసార్ట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ హోటల్లోని లోపాలను గుర్తించి అధికారులపై ఆగ్రహించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం హరిత తారామతి బారదారి రిసార్ట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిసార్ట్ అంతా కలియతిరిగారు. హరిత హోటల్ గదులు, హరిత రెస్టారెంట్, పుష్పాంజలి ఆంఫీ థియేటర్, ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్, టాయిలెట్స్ పరిశీలించారు. హోటల్ నిర్వహణపై లోపాలను గుర్తించి ఆయన సీరియస్ అయ్యారు. హోటల్ ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని, వెంటనే వాటిని మరమ్మతు చేయాలని ఆదేశించారు. చెత్తాచెదారాన్ని తొలగించి రిసార్ట్ ప్రాంగణమంతా ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
తారామతి బారదారి హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్లో విశాలమైన స్థలంలో ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఆశించినస్థాయిలో రావడం లేదని మీడియాతో మాట్లాడుతూ మంత్రి జూపల్లి పేర్కొన్నారు. దీనికి నిర్వహణ లోపమే కారణం అని మంత్రి జూపల్లి అన్నారు. గతంలో పట్టించుకునే నాథుడే లేకపోవడం, వివిధ స్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగా హరిత హోటళ్ల నిర్వహణ లోపభూయిష్టంగా మారిందని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు? జీతాలు సకాలంలో అందుతున్నాయా? లేదా అని కూడా మంత్రి ఆరా తీశారు. హరిత రిసార్ట్ నిర్వహణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల కోడ్ ముగిసినందున ఇక పై పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖలపై సమీక్షలు చేస్తామని, ఇప్పటి నుంచి నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు సంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామని వివరించారు.కఠిన నిర్ణయాలు తీసుకుని మరో మూడు లేదా నాలుగు నెలల్లో హరిత రిసార్టుల రూపురేఖలను మారుస్తామని చెప్పారు. తద్వార ప్రభుత్వ ఆదాయం పెంచడంతోపాటు పర్యాటకులకు మెరుగైన వసతులు, సదుపాయాలను కల్పిస్తామని వివరించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించడానికి ప్రయత్నిస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ నాయుడు, జీఎం(ప్రాజెక్ట్స్) ఉపేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.