– కేసీఆర్ వరుస రివ్యూలు
– ఎర్రవల్లి పాంహౌస్కు నేతల క్యూ
– ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో మీటింగ్
– సెగ్మెంట్ల వారీగా పడిన ఓట్లపై ఆరా
– మల్కాజ్గిరి పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ
– నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఓడిపోవడంతో అసహనం
– అంతా డ్రామా అంటున్న హస్తం నేతలు
KCR: అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతోంది. ఏ ఎన్నిక చూసినా వరుస షాకులు తగులుతున్నాయి. దీంతో గులాబీ బాస్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ గుండు సున్నాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన గ్రేటర్ పరిధిలోని లోక్ సభ సీట్లను కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ మనుగడ కష్టమనే ప్రచారం జరుగుతోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన కేసీఆర్ వరుస మీటింగులు నిర్వహిస్తున్నారు.
కేటీఆర్, హరీష్ రావుతో చర్చలు
లోక్ సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా చెప్పారు కేసీఆర్. కానీ, సగానికి పైగా సీట్లలో మూడో స్థానంలో నిలిచారు గులాబీ అభ్యర్థులు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫాంహౌస్లో వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. ముందుగా కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయ్యారు. పోటీ చేసిన అన్ని చోట్లా అభ్యర్థుల ఓటమికి గల కారణాలపై ఆరా తీశారు. ఎంతో నమ్మకం పెట్టుకున్న మెదక్ సీటును కూడా కోల్పోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు, ఓటు శాతం భారీగా తగ్గిపోవడంపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ
ఓటమిపై వరుస రివ్యూలు చేస్తున్న కేసీఆర్, గురువారం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరయ్యారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఓటమి గల కారణాలపై వారితో చర్చించారు కేసీఆర్. ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్నారు. ఇతర నియోజకవర్గాలపైనా కేసీఆర్ మీటింగులు వరుసగా కొనసాగున్నట్టు సమాచారం.
అంతా డ్రామా అంటున్న హస్తం శ్రేణులు
కేసీఆర్ వరుస భేటీలపై అధికార కాంగ్రెస్ సైడ్ నుంచి సెటైర్లు వినిపిస్తున్నాయి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు రివ్యూ మీటింగులు అంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు హస్తం నేతలు. బీజేపీతో కుమ్మక్కు అయి, బీఆర్ఎస్ ఓట్లను అటువైపు తిప్పి ఇప్పుడు ఓటమికి కారణాలపై సమీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కలిసి కాంగ్రెస్ను దెబ్బ తీయాలని కుట్రలు చేశారని విమర్శిస్తున్నారు హస్తం నేతలు.