Visakhapatnam: విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా విశాఖపట్నం నుంచి గెలుస్తానని పలుమార్లు విశ్వాసంగా చెప్పిన కేఏ పాల్ ఫలితాలను చూసి ఖంగుతిన్నారు. ఎన్నికల్లోనే కుట్ర జరిగిందని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు వేసిన ఓట్లు కూడా తనకు పడలేదని ఈవీఎంలను అనుమానించారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీతో జతకట్టినందునే టీడీపీ, జనసేనలకు ఆ స్థాయిలో ఓట్లు పడ్డాయని, అవి వాస్తవ ఓట్లు కావని అన్నారు.
తన తండ్రి, సోదరి సహా 22 మంది కుటుంబ సభ్యులు తనకు ఓటు వేయడానికి మురళీనగర్లోని 235 బూత్కు వెళ్లారని, వారు ఓటు కూడా వేశారని కేఏ పాల్ తెలిపారు. కానీ, ఆ ఓట్లు తనకు పోల్ కాలేవని, ఎన్నికల్లో కుట్రకు ఇదే నిదర్శనం అని ఆరోపించారు. కనీసం తమ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తనకు చూపించలేదని, బూత్ మొత్తంలో కేవలం నాలుగంటే నాలుగు ఓట్లు మాత్రమే పడ్డాయని వివరించారు.
గతంలో ఈవీఎంలను భద్రపరిచిన గదుల నుంచి సీసీటీవీల వెబ్ లింక్ ఇచ్చారని, కానీ, ఈ సారి తాను అడిగిన ఇవ్వలేదని కేఏ పాల్ అన్నారు. ఎందుకు ఇవ్వలేదని తాను కోర్టున కూడా ఆశ్రయించినట్టు వివరించారు. ఈ కేసు జూన్ 6న విచారణకు రానుందని, తాను ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను చెబుతానని తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వంతో అంటకాగితేనే ఇక్కడ ఈవీఎంలలో ఓట్లు కనిపిస్తాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
తనకు విశాఖపట్నంలో నిరుద్యోగులు, యువత నుంచి సుమారు రెండు లక్షలు, క్రైస్తవుల నుంచి మూడు లక్షల ఓట్లు, బడుగు బలహీనవర్గాల నుంచి మరో రెండు లక్షల ఓట్లు పడాల్సిందని, కానీ, ఆ ఓట్లేమీ తనకు కనిపించడం లేదని, ఇదంతా ఎన్నికల్లో జరిగిన కుట్రే అని ఆరోపణలు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ను మెచ్చుకుంటూనే ఆయన కుటుంబ సభ్యులు నిజంగానే ఆయనకు వేశారా? అంటూ అనుమానలు వ్యక్తం చేశారు. కేఏ పాల్ అనుమానించాల్సింది ఆయన కుటుంబ సభ్యులనా? ఈవీఎంలనా? అంటూ కామెంట్లు పేల్చారు.