T.high court phone tapping
Politics

High Court: సారీ.. స్టే కుదరదు

– మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టు షాక్
– కమిషన్‌ నోటీసులపై స్టే కుదరదన్న న్యాయస్థానం
– నేడు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదన

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది. విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలను విచారించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్‌ను రద్దు చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జ్యుడిషియల్‌ కమీషన్‌ ఏర్పాటును సవాల్ చేస్తూ, దానిని రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్‌ను గురువారం న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

గురువారం కేసీఆర్ తరపున న్యాయవాది ఆదిత్య సోంధి తన వాదనలు వినిపించారు. గతంలో ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని, ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియల్‌ కమీషన్ వేసి విచారణ జరపటం కుదరదని తెలిసి కూడా ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. తన క్లయింటును జూన్ 15లోపు కమిషన్ ముందుకు వచ్చి సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించిందనీ, నోటీసులపై తన క్లయింట్ జవాబు వినకుండానే, జూన్ 11న కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నర్సింహరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు మాట్లాడారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. భద్రాద్రి ప్రాజెక్ట్ సబ్‌ క్రిటికల్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేశామని చెబుతున్నారనీ, దేశ వ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు ఇలానే నిర్మించారని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను నియమించటమే నియమాల ఉల్లంఘన అని, ఈ నెల 30 నాటికి కమిషన్‌ను నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరటాన్ని బట్టి కమిషన్‌పై ఒత్తిడి ఉన్నదని అర్థమవుతోందని, ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అని కోర్టు దృష్టికి తెచ్చారు. కమిషన్ ఈ నెల 19న ఇచ్చిన నోటీసులో తన క్లయింటును జూన్ 27వ తేదీకల్లా కమిషన్ ముందు హాజరు కావాలని కోరారని, ఆ గడువు తేదీని మరోరోజు పొడిగించాలని, అప్పటివరకు స్టే విధించాలని కోర్టును కోరారు.

అయితే.. పిటిషనర్ తరపు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఇందుకు నిరాకరించారు. జ్యుడిషియల్ ఎంక్వయిరీ పూర్తయిన తర్వాత ఎలాగూ నివేదిక వస్తుందని, ఆ తర్వాత దానిని శాసన సభలో పెట్టి చర్చించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కోరినట్లుగా ఈ కేసులో తాము స్టే ఇవ్వలేమని చెబుతూ, తదుపరి కేసు విచారణను ఈ రోజుకు (శుక్రవారానికి) వాయిదా వేశారు. కాగా, దీనిపై నేడు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు