Harish Rao: ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి?
Harish Rao ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Political News, లేటెస్ట్ న్యూస్

Harish Rao: ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్!

Harish Rao: అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూ మేత’ అయ్యిందా అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ వేదికగా శుక్రవారం ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘‘భూ భారతి భూ హారతిగా మారిందా? కాంగ్రెస్ నాయకులకు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా? పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నది ప్రభుత్వ తీరు. మీరు తెచ్చిన రెవెన్యూ చెత్త సంస్కరణలు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తాం అనే హామీ ఏమైంది అని నిలదీశారు.

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం

భూముల రికార్డులు సరిచేస్తాం, రైతుల హక్కులు కాపాడుతాం అని చెప్పి రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదని హరీశ్ రావు నిలదీశారు. కొత్తగా అప్లికేషన్‌ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసులుబాటు కల్పించడం లేదని అడిగారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వమని, ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అని మండిపడ్డారు. ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

Also Read: Harish Rao: రైతుల కన్నీళ్లు పట్టట్లేదా.. పంట బీమా ఎక్కడ.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

రెండేళ్లుగా ఏం చేశారు?

ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి? రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని అడిగారు. నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో భూ సమస్యల పరిష్కారానికి 30 శాతం నుంచి 40 శాతం లంచాలు ఇస్తే గాని పని కాని పరిస్థితి అని దుయ్యబట్టారు. రిజిస్ట్రేషన్ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడిగారు. ఇప్పటికే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 మందికి పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంట బోనస్ ఇవ్వక పోవడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్‌లో ఉన్న భూ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలని డిమాండ్ చేశారు.

భూ భారతి విఫలం

‘‘ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడుతాం’’ అని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఊదరగొట్టిందని హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసీల్దార్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా అని అడిగారు. ధరణిపై అడ్డగోలుగా మాట్లాడి మీరు గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. మొన్న భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో అన్నదమ్ములు ఆందోళనకు దిగారని, తర్వాతి రోజు భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేశాడని, ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

హరీశ్ రావుతో రఘువీరారెడ్డి భేటీ

ఇటీవల తండ్రిని కోల్పోయిన మాజీ మంత్రి హరీశ్ రావుని హైదరాబాద్‌లో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కలిశారు. హరీశ్ రావు తండ్రి మృతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు.

Also ReadHarish Rao: రైతుల కన్నీళ్లు పట్టట్లేదా.. పంట బీమా ఎక్కడ.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?