– బీజేపీలోకి ఎవరైనా రావొచ్చు
– హరీష్ రావు వచ్చినా చేర్చుకుంటాం
– కేసీఆర్ చేరతానన్నా స్వాగతిస్తాం
– కేసీఆర్ను స్కాములు చుట్టుముడుతున్నాయి
– ఆయన ఇంటికి ఈడీ వెళ్లడం ఖాయం
– బీఆర్ఎస్ పని అయిపోయిందన్న రఘునందన్
Telangana BJP: బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఆపార్టీ టైటానిక్ షిప్లా మునిగిపోయిందని చరిత్రలో రాసుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం) ఖాయమని పేర్కొన్న ఆయన, బీజేపీలోకి హరీష్ రావు వచ్చినా, కేసీఆర్ వచ్చినా స్వాగతిస్తామన్నారు. హరీష్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఇటీవల చర్చ ఊపందుకున్న నేపథ్యంలో రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. అదే సమయంలో గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలను ప్రస్తావిస్తూ ఈ కేసుల్లో ఇరుక్కున్న అధికారులంతా కేసీఆర్ పేరే చెబుతున్నారని ఆరోపించారు. అన్ని వేళ్లూ ఆయన వైపే చూస్తున్నాయని, కాబట్టి కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదని రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు.
ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములను బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రామిరెడ్డి అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. అందుకే, మొదటగా క్షీరసాగర్ నుంచే పని మొదలుపెడతానని, దళితుల భూములు వారికి అప్పగించడానికి కృషి చేస్తానని తెలిపారు. మెదక్కు ఇందిరా గాంధీ రాకముందే బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్లు వచ్చాయని వివరించారు. మెదక్ను తాను సమ్మిళితంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయిస్తామని వివరించారు. ఇక కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపై విమర్శలు సంధిస్తూ, ఐటీఐఆర్ ప్రాజెక్టు గైడ్లైన్స్ అన్నీ అమలు చేశామని, ఇది టెక్నికల్గా మాత్రమే రద్దయిందని చెప్పారు. ఐటీఐఆర్ గురించి తెలిస్తే జగ్గారెడ్డితో చర్చకు రెడీ అని పేర్కొన్నారు. ఆయన పెరిగింది ఆర్ఎస్ఎస్లోనే అని, మొదట గెలిచింది కూడా బీజేపీ నుంచేనని గుర్తు చేశారు.
పార్టీ అధ్యక్ష పదవిపై కామెంట్స్
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రఘునందన్. ‘‘ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది. అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తా. క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తగా పని చేస్తా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు. రాజాసింగ్ తన అభిప్రాయం వ్యక్తపరిచారు. కొత్త నాయకుడికి అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ అన్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.