Compassionate Appointments: సింగరేణి కార్మికులకు తీపి కబురు అందింది. కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచింది. కార్మిక కుటుంబాల డిమాండ్లను విన్న రేవంత్ రెడ్డి గతంలోనే ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీకి అనుగుణంగా తాజాగా సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంది.
కారుణ్య నియామకాల వయోపరిమితి పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తారు. లేదా అనారోగ్యంతో (మెడికల్ అన్ఫిట్) ఉద్యోగ విరమణ చేసిన వారి పిల్లలనూ బదిలీ కార్మికునిగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇలా ఉద్యోగంలోకి తీసుకునేవారికి వయోపరిమితి ఉంటుంది.
గతంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉన్నవారినే ఈ కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలోకి తీసుకునేవారు. తాజాగా, గరిష్ట పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మిక కుటుంబాలకు ఇచ్చిన హామీకి అనుగుణంగానే తీసుకున్నారు. ఇక్కడ మరో మంచి విషయం కూడా ఉన్నది. ఈ నిర్ణయం 2018 మార్చి 9వ తేదీ నుంచి వర్తించనుంది. అప్పటి నుంచి ఎవరైనా వయో పరిమితి కారణంగా ఉద్యోగంలోకి వెళ్లలేకపోతే వారికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. ఈ ఆదేశాలతో సింగరేణిలో వందలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కుటుంబాలు వయోపరిమితి సడలింపు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.