- ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో బీఆర్ఎస్ వర్గాల్లో నైరాశ్యం
- సింగిల్ డిజిట్ వస్తాయంటున్న 12 ఎగ్జిట్ పోల్ సంస్థలు
- అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి పెరిగిన వలసలు
- పార్లమెంట్ ఫలితాల తర్వాత మరిన్ని వలసలు తప్పవంటున్న రాజకీయ పండితులు
- ఫలితాలపై అగ్ర నేతల్లో మొదలైన గుబులు
- ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలు సైతం పార్టీలు మారే ఛాన్స్
- పైకి షేర్వాణి లోన పరేషాని అన్నట్లుగా ఉన్న బీఆర్ఎస్
- బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తున్న ఎగ్జిట్ పోల్స్
Exit polls surveys expects brs get one or two seats:
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సాధించిన విజయంతో బీఆర్ఎస్ అగ్ర నేతలు తామేదో అద్భుత విజయం సాధించామని ఇదే విజయ పరంపర ఇకపై కొనసాగుతుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అక్కడ అనుకూలించే అంశాలు వేరేరకంగా ఉంటాయి. అయితే రీసెంట్ ఎగ్జిట్ పోల్స్ అంశాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ కు అనుకూలంగా లేవని అర్థం అవుతోంది. దాదాపు 12 సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ పతనం దిశగా అడుగులు పడుతున్నట్లే కనిపిస్తోంది. పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కు పతనం తప్పదని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. మరికొందరైతే ఫలితాల తర్వాత మళ్లీ కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితం అవుతారని జోస్యం చెబుతున్నారు.
పతనం అంచున బీఆర్ఎస్
పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పతనం అంచున పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకున్న గులాబీ పార్టీ పార్లమెంట్ ఫలితాలు వచ్చే నాటికి కేవలం సింగిల్ డిజిట్ లేక రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా గంపగుత్తగా బీఆర్ఎస్ పరిస్థితి దాదాపు ఇంతే అన్నట్లుగా అంచనా వేశాయి. ఎమ్మెల్సీ విజయం చూపించి కార్యకర్తలలో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. రేపటి ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటని బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఇతర పార్టీలకు వలస వెళ్లిన నేతలతో సహా కొత్తగా మరింతమంది పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సింగిల్ డిజిట్ తప్పదా?
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని రకాల గాంభీర్యపు ప్రకటనలైనా చేయవచ్చు గానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కేసిఆర్ దళం పతనాన్ని స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. 12 సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో.. ముగ్గురు భారత రాష్ట్ర సమితికి కేవలం సున్న స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేశారు! అదే సమయంలో మరో నాలుగు సంస్థలు సున్న నుంచి ఒక్క స్థానం దక్కే అవకాశం ఉన్నదని చెప్పుకొచ్చాయి. ఒక సంస్థ నుంచి మూడు స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తుండగా, మరో ఇద్దరు రెండు స్థానాలు గెలుస్తారని, ఒకే ఒక్క సంస్థ న్యూస్ 18 మాత్రం రెండు నుంచి ఐదు స్థానాలలో భారత రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని అంచనావేయడం జరిగింది.
పార్టీని వీడేందుకు మరికొందరు సిద్ధం
పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండబోతున్నదని ముందే అర్థమైంది ఆ పార్టీ ఎంపీలు పలువురు భారతీయ జనతా పార్టీ కాంగ్రెసులలో చేరిపోయారు. అలాగే టికెట్లు కేటాయించే సీజన్ వచ్చిన తర్వాత ఎంపీ టికెట్లు ఇస్తామంటే పలువురు సీనియర్ నాయకులు మాకు వద్దంటే వద్దంటూ తిరస్కరించారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. కొందరైతే టికెట్ ప్రకటించిన తర్వాత కూడా మాకు వద్దని తిరస్కరించారు. ఒకవైపు కేసీఆర్ పిలిచి మరీ టికెట్ ఇస్తానని అన్నప్పటికీ పుచ్చుకోకుండా వద్దని అన్నవారు.. మరొక పార్టీలోకి గెంతి అక్కడ టికెట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికలలో ప్రభావశీలంగా ఉండగలదనే నమ్మకం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులలో పూర్తిగా సన్నగిల్లి పోయింది. వారందరి అంచనాలకు తగినట్లుగానే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఉత్తుతివే అని, మేము గెలిచి తీరుతాము అని, తండ్రి కొడుకులు చెప్పుకోవచ్చు గాక.. ఇంకా కొద్ది గంటల్లో ఆ మాట చెప్పగల అవకాశాన్ని కూడా వారు కోల్పోతారు! ఇప్పటికైనా మేలుకుంటే కనీసం రాబోయే ఐదేళ్లలో పార్టీని కాపాడుకోవడానికి వారు శ్రద్ధ పెట్టడం కుదురుతుంది. ఇంకా అహంకారం వీడకుండా, వాస్తవాలను గుర్తించకుండా ఆత్మవంచనతో నడుచుకుంటే నష్టపోయేది కల్వకుంట్ల కుటుంబమే.