Telangana Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊపుతో రాష్ట్రంలో ఏ బైపోల్ వచ్చినా గెలవడం ఈజీ అని కాంగ్రెస్ భావిస్తున్నది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో జెండా ఎగురవేసిన కాంగ్రెస్ టీమ్ మిగతా సెగ్మెంట్లలోనూ గెలుపొందడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు స్పీకర్, కోర్టుల నుంచి టెక్నికల్ ఇబ్బందులు వచ్చినా, రాజీనామా చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నది. ఇందులో మొదటి విడుతగా ఖైరతాబాద్, ఆ తర్వాత స్టేషన్ ఘన్పూర్ను సెలక్ట్ చేసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
త్వరలోనే నిర్ణయం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్పై గెలుపొందిన దానం నాగేందర్, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్పై ఎంపీగా పోటీ చేయడం టెక్నికల్గా చిక్కులు ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలుపొందిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కూతురు కాంగ్రెస్ ఎంపీ టికెట్ తెచ్చుకోగా, దగ్గరుండి మరీ చేసిన ప్రచారం, స్టేజీలపై ఇచ్చిన స్పీచ్లు టెక్నికల్గా ఇబ్బందులకు గురి చేసే ఛాన్స్ ఉన్నది. స్పీకర్, కోర్టుల నుంచి వ్యతిరేకంగా తీర్పు వస్తే రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్పై పోటీ చేయాలని ఆయా ఎమ్మెల్యేలు భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే తాము రాజీనామా చేస్తామని వార హైకమాండ్కూ తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఏఐసీసీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ను చూసి పాజిటివ్గా రియాక్ట్ అయినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కీలక సెగ్మెంట్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ స్థానాల్లో పట్టు సాధించిన కాంగ్రెస్, మిగతా సెగ్మెంట్లపై కూడా ఫోకస్ పెంచింది. ఇవి హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలం మరింత పెంచుకోవడానికి ఉపయోగపడతాయని సర్కార్ భావిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ గెలిచిన కీలక నియోజకవర్గంలో తమ పట్టు నిరూపించుకునేందుకు ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఆసక్తి చూపుతున్నది. దీనిలో భాగంగానే ఖైరతాబాద్లో మరోసారి ఉప ఎన్నిక ట్రయల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాన్సువాడలో కూడా తాను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. టెక్నికల్గా రద్దు కాకముందే రాజీనామా చేయడం బెటర్ అనే అభిప్రాయంలో పోచారం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ బీ ఫామ్పై పోటీ చేసి గెలుస్తానని ఆయన హామీ ఇస్తున్నారని తెలిసింది. దీంతో ఆ నియోజకవర్గంలోనూ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్నదనే చర్చ గాంధీ భవన్లో జరుగుతున్నది.
అదే రాజకీయ వ్యూహం.. పదేళ్ల పవర్కు పట్టు?
పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా మరింత పట్టు సాధించాలని, అలాగే పార్టీ పటిష్టతను చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు విడుతల వారీగా, వ్యూహాత్మకంగా ఉప ఎన్నికలను నిర్వహించేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటు అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని గట్టిగానే భావిస్తున్నది. ఉప ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గతంలో కేసీఆర్ కూడా ఈ ప్లాన్ను అమలు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ఎన్నిక, మరో అసెంబ్లీ ఎన్నికల మధ్య గ్యాప్లో బై ఎలక్షన్లు నిర్వహించి, విజయం సాధించి, తమ పార్టీనే ప్రజలు ఆదరిస్తున్నారనే సంకేతాలను చూపారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే లైన్లో సాగుతున్నదనేది రాజకీయ పండితుల అభిప్రాయం.
విలీనం అయితే ఓకే.. లేకుంటేనే?
ఒకే సారి పార్టీ విలీనానికి అవసరమయ్యే ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే ఇంకా సులువుగా ఉంటుందనేది కాంగ్రెస్ మరో ఆలోచన. ఒక వేళ అలా కుదరకపోయినా సింగల్గా వచ్చినా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నయా స్ట్రాటజీకి ఏఐసీసీ నుంచి పూర్తి మద్దతు లభించినట్లు సమాచారం. దీని వలన రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడానికి, ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను మరింత బలంగా చూపడానికి ఉప ఎన్నికలు కీలకంగా మారతాయని అధిష్టానం భావిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరపగా పాలేరు, నారాయణఖేడ్, నాగార్జునసాగర్, హూజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో జాయినింగ్స్ కూడా భారీగానే జరిగాయి. దుబ్బాక, హుజూరాబాద్లో ఓటమి చెందగా, ఆ ఎన్నికలు కాస్త నష్టాన్ని చేకూర్చాయి. అయితే, ప్రభుత్వంలో ఉన్నందున ఉప ఎన్నికల్లో ప్రజలు తమవైపే ఉంటారనేది కాంగ్రెస్ బలమైన నమ్మకంగా కనిపిస్తున్నది.
Also Read: Telangana Congress: కాంగ్రెస్ సాధించిన చారిత్రక విజయం.. కార్యకర్తలు నేతలు సంబురాలు
