cm Revanth Reddy invites governor Telangana formation day celebrations :
తెలంగాణ 11వ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావలసిందిగా శనివారం గవర్నర్ సీపీ రారాధాకృష్ణను సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ఇన్వేటేషన్ తో ఆహ్వానించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేయనుంది. గత పదేళ్లలో లేని విధంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలనూ వేడుకలకు ఆహ్వానం పంపింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన లేఖ పంపారు సీఎం రేవంత్ రెడ్డి.
పరేడ్ గ్రౌండ్స్ లో సోనియా ప్రసంగం
ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు నిర్వహించనుంది ప్రభుత్వం. జూన్ 2న ఉదయం ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పిస్తారు. 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో పోలీసుల కవాతు ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, సోనియా గాంధీ మాట్లాడతారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ వేడుకలను కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియాగాంధీని స్పెషల్ గెస్ట్గా రావాలని కలిసి ఆహ్వానించారు. సోనియాను ప్రత్యేకంగా సన్మానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది.
ట్యాంక్ బండ్ పై ధూంధాంగా..
సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మొదలవుతాయి. రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్కు సీఎం రేవంత్రెడ్డి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. దాదాపు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.