– రాష్ట్రానికి రావాల్సిన రూ. 693.13 కోట్లు ఇవ్వండి
– అక్టోబర్ నుంచి అంతా రాష్ట్ర నిధులే
– కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Health Minister JP Nadda: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రెండో రోజు కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతోపాటు పార్టీ అధిష్టానం పెద్దలనూ కలుస్తున్నారు. సోమవారం కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్నాథ్ సింగ్లను కలిసిన సీఎం మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. అత్యవసర వైద్య సేవల్లో అంతరాయం, వైద్య సిబ్బందికి వేతనాల ఇబ్బంది తలెత్తకుండా గత ఏడాది అక్టోబర్ నుంచి కేంద్రం వాటా, రాష్ట్రం వాటా అన్నీ కూడా తామే విడుదల చేస్తున్నామని వివరించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరారు. వైద్యారోగ్య రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నదని, ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నింటినీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్టు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో 5,159 బస్తీ దవాఖానాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎన్హెచ్ఎం 2023-24 సంవత్సరంలో మూడు, నాలుగో త్రైమాసికాల నిధులు రూ. 323.73 కోట్లు పెండింగ్లో ఉన్నాయని సీఎం వివరించారు. 2024-25 మొదటి త్రైమాసికానికి గ్రాంట్ రూ. 231.40 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని కేంద్రమంత్రి నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి వికోరారు.
ఈ రోజు తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంటక్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరైనట్టు సమాచారం.
ఈ కార్యక్రమాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. సోమవారం రాత్రి ఆయన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను కలిశారు. వెంట పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. తాజాగా మంగళవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ వెంట ఎంపీలు మల్లు రవి, సురేశ్ కుమార్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులైడన అనిల్ కుమార్ యాదవ్లు కూడా ఉన్నారు.
ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్ష మార్పుపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలపైనా అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చించినట్టు తెలిసింది. వేరే పార్టీల నుంచి సీనియర్ నాయకులు కాంగ్రెస్లోకి వచ్చారు. వారు మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జరగనున్న కేబినెట్ విస్తరణపై వలస వచ్చిన నాయకుల్లో ఆసక్తి నెలకొంది. నాలుగు నుంచి ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా, మంత్రి పదవి కోసం 20 మంది రేసులో ఉన్నట్టు సమాచారం.