CM praised Helping nature traffic police upsc exam:
యూపీఎస్సీ ప్రిలిమ్స్ కు వెళుతున్న ఓ యువతిని పరీక్ష కేంద్రానికి తరలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం వాహనాల నియంత్రణే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం అందించిన కానిస్టేబుల్ సురేష్ ను స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్లర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.. ఆల్ ది బెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
సర్వత్రా ప్రశంసలు
సంవత్సరాల పాటు కష్టపడి చదివి తీరా పరీక్ష రోజు పలు కారణాల వల్ల ఎగ్జా్మ్ సెంటర్ కు చేరుకునే సమయం ఆలస్యం అయ్యి పరీక్ష రాయలేకపోతే ఆ అభ్యర్ధి మనోవేదన వర్ణించలేనిది. ఇలాంటి ఓ అభ్యర్ధికి దు:ఖాన్ని దరిచేరకుండా చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనికి ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. ఆదివారం దేశ వ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఓ మహిళా అభ్యర్ధి తాను వెళ్లాల్సిన పరీక్ష కేంద్రానికి కాకుండా మరో పరీక్ష కేంద్రానికి వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ లో ఆరా తీయగా అది వేరే చోట ఉందని, అక్కడికి వెళ్లాలని సూచించారు.
సకాలంలో పరీక్ష కేంద్రానికి
పరీక్షకు కొద్ది సమయం మాత్రమే ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు రాజేంద్రనగర్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేస్ తాను దిగబెడతానని భరోసా ఇచ్చారు. వెంటనే పోలీస్ పెట్రోలింగ్ బైక్ పై ఆమెను ఎక్కించుకొని సకాలంలో గమ్యస్థానానికి చేర్చారు. దీనికి సంబందించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. ఇతరులకు సహాయం చేయడం ద్వారానే మనం పైకి లేస్తాము అని రాసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ తప్పు. కానీ ఆ సమయంలో తప్పదు అంటూ మెచ్చుకుంటున్నారు.