- హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఇప్పటివరకు ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్
- రెండు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిపై విజయం
- కవితకు అత్యంత సన్నిహితుడిగా పేరు
- సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరిక
- ఫలిస్తున్న ఆపరేషన్ కాంగ్రెస్ వ్యూహం
BRS mla Dr.sanjay kumar giving shock to kcr change into congress party:
బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన జగిత్యాల ఎం.సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు.కాగా సంజయ్ కుమార్ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. అయితే.. బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు బరిలో దిగిన డాక్టర్ సంజయ్.. రెండు సార్లూ.. కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిపై గెలుపొందారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత కు సన్నిహితంగా మెలిగే సంజయ్.. ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని బీఆర్ఎస్ శ్రేణులు దాదాపు ఊహించి ఉండవు. కాగా.. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికపైనే బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రోజునే తన ప్రత్యర్థి అయిన సంజయ్.. కాంగ్రెస్ పార్టీలో చేరటం గమనార్హం. ఇక దీనిపై జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది.