BRS KTR: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ వారంలోనే నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కోర్టు ఆదేశాలతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్వహించే అవకాశం ఉండడంతో అలర్ట్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సంసిద్ధం చేయాలని పార్టీ నేతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాల్లోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Also Read: BRS Party: స్థానిక ఎన్నికల ముందు నేతలు చేజారకుండా ప్లాన్..
ఈ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలు, వైఫల్యాలను గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా వేధిస్తున్న ఈ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనాన్ని తెలియచేయాలన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగునీటి నుంచి విద్యుత్ సరఫరా దాకా అన్నదాతలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని చెప్పాలని ఆదేశించారు.
పడకేసిన పారిశుధ్యం
రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారి గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందన్న సంగతిని బీఆర్ఎస్ (Brs) ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. మరో వైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ది లేని కాంగ్రెస్ (Congress) సర్కార్ ఆర్డినెన్స్ పేరుతో చేస్తున్న కాలయాపనను ప్రజలకు విడమిర్చి చెప్పనున్నారు. వివిధ రంగాలకు డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆయా రంగాలను మోసం చేసిన తీరును వివరించనున్నారు.
వృద్ధులకు రూ.4 వేల పింఛన్, ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలతో పాటు ఇతర హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధాలను ఎండగట్టనున్నారు. అన్ని వర్గాల ప్రజల తరఫున గత 20 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ చేస్తున్న ప్రజా పోరాటాలు, నిరసన కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేసేలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని భావిస్తుంది. ఈ కార్యక్రమాలను ఈ వారంలోనే ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు.
Also Read: V.S. Achuthanandan: కమ్యూనిస్ట్ కురువృద్ధుడు అచ్యుతానందన్ కన్నుమూత