– కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం
– దగాపడిన నేల నీటి కోసం జరిపిన పోరాట ఫలితం
– ఎక్కడో ఓ చిన్న లోపం ఉంటే సరిదిద్దుకోవాలి
– అంతేగానీ, రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు
– కాళేశ్వరం అంటే ఓ బ్యారేజ్ కాదు ప్రాజెక్ట్
– కేటీఆర్ మరో ట్వీట్
BRS Ex Minister KTR tweets about Kaleswaram Project: వర్షాకాలం నేపథ్యంలో నదులకు వరద నీరు చేరుతోంది. అయితే, మేడిగడ్డ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో ఈసారి నీటి నిల్వకు వీలు లేకుండా పోయింది. గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో వరుస ట్వీట్లు చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ పాపం అంతా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేసిన కేటీఆర్, కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం అని అన్నారు. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య, అసూయ పుట్టించి, కన్నుకుట్టించిన వరప్రదాయిని కాళేశ్వరం అని తెలిపారు. తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం అని పేర్కొన్నారు. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న చేను, చెలకలు, నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం అని స్పష్టం చేశారు.
‘‘దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్కు పునరుజ్జీవమిచ్చిన పుణ్య వరం కాళేశ్వరం. నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాం సాగర్ను నిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం. మండుటెండల్లో చెరువులను మత్తళ్లు దూకించిన మహత్యం కాళేశ్వరం. మా తపనకు, ఆలోచనకు, అన్వేషణకు, జలదౌత్యానికి నిదర్శనం కాళేశ్వరం. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం. సరిదిద్దుకోగలం. రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం. మీ ఏడుపే మా ఎదుగుదల’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.