Money saving Tips: ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి బయటపెట్టలేని పరిస్థితి.. చాలా ప్రాంతాల్లో ఉంటున్నాయి. అయితే సమ్మర్ లో ఉక్కపోతతో పాటు మరో సమస్య కూడా అందరినీ వేధిస్తుంటుంది. అదే అధిక ఖర్చులు. ఇతర కాలాలతో పోలిస్తే సమ్మర్ లో డబ్బు వినియోగం అధికంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. విద్యుత్ వినియోగం, పిల్లల స్కూల్ సెలవుల నేపథ్యంలో చాలా మందికి పరిమితికి మించి ఖర్చు అవుతుంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే కొంతమేర డబ్బును ఆదా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పిక్నిక్ విషయాల్లో జాగ్రత్త
పిల్లలకు స్కూల్ సెలవులు కావడంతో షాపింగ్ మాల్స్, సినిమాలు, కిడ్స్ గేమింగ్ జోన్స్ లో తల్లిదండ్రులు ఎక్కువగా గడుపుతుంటారు. దీనివల్ల చాలా వరకూ డబ్బు ఖర్చు అవుతుంటుంది. అలా కాకుండా కమ్మూనిటీ ఈవెంట్స్, బీచ్ లు, స్థానిక పార్క్స్ కు పిల్లలను తీసుకెళ్లడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. దీని వల్ల నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకూ సేవ్ చేసుకోవచ్చు.
విద్యుత్ వినియోగం
వేసవిలో ఉక్కపోత అధికంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నా సరే బయట ఉన్నట్లే అనిపిస్తుంటుంది. దీంతో ఫ్యాన్లు, ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. దీనివల్ల విద్యుత్ బిల్లులు.. వేలల్లో వస్తుంటాయి. అయితే దీనికి తలుపులు, కిటికీల మూసివేత ద్వారా చెక్ పెట్టవచ్చు. అవి బయట ఉన్న వేడి గాలిని ఇంట్లోకి మోసుకొస్తుంటాయి. అలాంటి సమయాల్లో ద్వారాలు, కిటీలను మూసివేయడం ద్వారా ఇల్లు కొద్దిమేర చల్లగా ఉంటుంది. అలాగే ఏసీలను నిరంతరం ఆన్ లో ఉంచకుండా రూమ్ చల్లగా అయ్యేంతవరకూ ఉంచి ఆఫ్ చేస్తే పవర్ బిల్లును తగ్గించవచ్చు.
స్మార్ట్ ట్రావెలింగ్
కొందరు సమ్మర్ వచ్చిందంటే శీతల ప్రాంతాలకు వెళ్లిపోతుంటారు. కాశ్మీర్, సిమ్లా వంటి ప్రదేశాల్లో కుటుంబంతో సరదాగా గడిపేందుకు రెడీ అవుతుంటారు. అయితే వారు ముందే తమ వెకేషన్స్ ను బుక్ చేసుకుంటే డబ్బు కొంతమేర ఆదా అవుతుంది. లేదంటే లాస్ట్ మినిట్ డీల్స్ ఉపయోగించుకొని టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకుంటే డబ్బును సేవ్ చేసుకోవచ్చు. తద్వారా హోటల్ బిల్స్, ఫ్లైట్ ఖర్చుల్లో రాయితీ పొందవచ్చు. దీనివల్ల రూ.5,000-10,000 వరకూ ఆదా చేసుకోవచ్చు.
Also Read: Simhachalam Tragedy: సింహాచలం విషాదం.. సాఫ్ట్ వేర్ దంపతులు సహా ఫ్యామిలీలో నలుగురి మృతి
ఔట్ సైడ్ ఫుడ్
కొందరు ఇంటి ఫుడ్ కంటే ఔట్ సైడ్ ఫుడ్ తినేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాంటి వారు సమ్మర్ లో జాగ్రత్త వహించాల్సిందేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లోకల్ మార్కెట్స్ లోని తాజా కూరగాయాలను తెచ్చుకొని ఎంచక్కా ఇంటి పట్టున వండుకుంటే.. అటు ఆరోగ్యానికి, ఇటు ఆర్థికంగా మంచి జరుగుతుందని సూచిస్తున్నారు. తద్వారా నెలకు రూ.7,500-12,500 వరకూ మిగిలినట్లేనని చెబుతున్నారు.
సీజనల్ సేల్స్
సమ్మర్ లో చాలా చోట్ల సీజనల్ సేల్స్ నడుస్తుంటాయి. తక్కువ ధరకే ఖరీదైన వస్తువులను ఇచ్చేస్తుంటారు. ఔట్ డోర్ ఫర్నిచర్, బట్టలు, స్పోర్ట్స్ సామాగ్రిలను ఇతర కాలాలతో పోలిస్తే సమ్మర్ తక్కువగే ఇస్తుంటారు. కాబట్టి వాటిని సమ్మర్ లో తీసుకోవడం ద్వారా డబ్బును కొంతమేర ఆదా చేసుకోవచ్చు. ఒక్కో వస్తువుపై 50% నుంచి 80% వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.