– ఇదే కేసీఆర్ అసలు బాధ
– బయట సూర్యుడి హీట్.. ఇంట్లో కుటుంబ సభ్యుల హీట్
– తట్టుకోలేక కాంగ్రెస్ పాలనపై నిందలు
– అధికారం పోయాక ట్విట్టర్ అకౌంట్ ఎందుకు?
– కేసీఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు
గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో తిరగని కేసీఆర్కు ఇప్పుడు హఠాత్తుగా ప్రజలపై ప్రేమ పట్టుకువచ్చిందా? అని సెటైర్ వేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారని, అప్పుడే ప్రజల్లో కనిపిస్తారని, అదే కేసీఆర్ స్టైల్ అని విమర్శించారు. బయటికి వస్తే ఎండ హీట్ ఉన్నదని, ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల హీట్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే తరుచూ కరెంట్ కట్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఓ చోట భోజనం చేస్తున్నప్పుడు మూడు సార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ విలేకరులకు చెప్పారని, భోజనం చేసేలోపే మూడు సార్లు కరెంట్ పోయిందా? అని జగ్గారెడ్డి అడిగారు. అసలు ఆయన బాధ ఎలక్ట్రిసిటీ పవర్ కట్ గురించి కాదని, ఆయన కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ గురించి అని సెటైర్ వేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం.. ఉన్నపళంగా విపక్షానికి వెళ్లడంతో తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పాలనపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
Also Read: వారసుల ఫైట్.. ఎన్నికల బరిలో నెక్స్ట్ జనరేషన్
ప్రజలు ఎవరైనా తమ గోడు చెబితే నాయకుడు విని అందుకు పరిష్కారం గురించి ఆలోచిస్తారని, కానీ, కేసీఆర్ ముందు ఎవరూ లేచి నిలబడినా.. ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన వారిస్తారని జగ్గారెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందు ఎవరు లేచి నిలబడి చెప్పినా.. శ్రద్ధగా వినేవారని, సభల్లో కూడా ఏదైనా మాట్లాడితే.. విని సంబంధిత అధికారులకు ఆ సమస్యను పరిష్కరించాలని సూచించేవారని గుర్తు చేశారు. కానీ, కేసీఆర్ అలా కాదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల బాధ పట్టని కేసీఆర్.. అధికారం పోయాక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారని అన్నారు. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు నవ్వాలో.. ఏడవాలో.. అర్థం కావడం లేదని చురకలంటించారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే ఆ పార్టీ బీజేపీతో మిలాఖత్తవుతుందని జగ్గారెడ్డి అన్నారు. కానీ, బీజేపీతో కాంగ్రెస్ కలిసే ఛాన్సే ఉండదని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ఈ రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిందని వివరించారు. ఈ రెండు సిద్ధంతాల పోరాటం ఇప్పటిది కాదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ అంటే మోడీకి భయం పట్టుకుందని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బంగారం తులం రూ. 28 వేలు ఉండేదని, ఇప్పుడు బీజేపీ పదేళ్లు అధికారం చెలాయించిన తర్వాత రూ. 70 వేలకు పెరిగిందని విమర్శించారు.