- కొనుగోలు కేంద్రాల్లో సామగ్రి టెండర్ల ఆలస్యం
- అకాల వర్షాలతో రైతన్నకు తీరని కష్టం
- పెండింగ్ బిల్లులకు 10 శాతం కమీషన్
- తాను అనుకునే కంపెనీలకే టెండర్ దక్కేలా అడ్డదారులు
- రైతు సేవా కేంద్రాల డిపాజిట్లకూ ఎసరు?
- రూ.10 కోట్ల విడుదలకు బోర్డు నిర్ణయం
- రైతుల గోస పట్టించుకోని ఆగ్రోస్
- టెండర్ల పక్రియపై ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్
- గుట్టుగా సాగుతున్న అవినీతి అంతా బట్టబయలు
- టెండర్ల దందాలపై ఇకపై ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం
Corruption: ప్రజల సొమ్ము వృథా కాకుండా పనులు చేసేందుకు యాక్షన్స్, టెండర్స్ (Tenders) పిలుస్తుంటారు. కాంట్రాక్టర్స్, బిడ్డర్స్ పనులు చేసేందుకు పోటీ పడుతారు. గతంలో ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికే ఇచ్చేవారు. నాణ్యత, పర్యవేక్షణ, గడువులోపు పనులు పూర్తి చేసేవారు. గత పదేళ్లుగా కొత్త కొత్త నిబంధనలు పెట్టి అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరికి ఇవ్వాలో వారికి అనుకూలంగా అంతా మార్చేసుకున్నారు. రూ.10 కోట్ల టెండర్లకు కూడా వందల కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనతో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు నడపడం కష్టమవుతున్నాయి. పేదలు, మహిళలు, చిన్నారులకు ఉపయోగపడే నిత్యవసర వస్తువుల నుంచి రైతులకు ఉపయోగ వాడే వాటిని కూడా వదలడం లేదు. టెండర్లు తమకే రావాలనే పట్టుదల చివరకు రద్దు వరకు వెళ్తున్నది.
ఆగ్రోస్లో అడిగే వారే లేరు
వ్యవసాయ శాఖ పరిధిలో ఉండే తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ (Kasula Balaraj) కు టెండర్ల టేస్ట్ తెలిసిపోయింది. 10 శాతం కమీషన్ ఇస్తేనే పాత బిల్లులు ఇస్తాం, కొత్త టెండర్లు పిలుస్తామని వ్యవహరించడంతో యాసింగికి కొనుగోలు కేంద్రాల్లో రావాల్సిన వస్తువులు చేరుకోలేదు. రెండు నెలల క్రితం టెండర్లు పిలిచినా పెండింగ్ బిల్లులతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రద్దు చేసి రైతుల ధాన్యం తడిసేందుకు కారకులయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్లపాలు అవుతున్నదంటే, కాసుల బాలరాజ్ కాసుల కక్కుర్తే కారణమని అంటున్నారు. 2022 – 23లో రూ.33 కోట్ల సామగ్రికి, దాని కొనసాగింపుగా 2024 – 25లో రూ.29 కోట్ల బిల్లులు విడుదల చేసేందుకు ఆయన సంతకం అవసరం. ఆగ్రోస్ చైర్మన్గా పత్రాలు వెనక్కి పంపాలంటే 10 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని 3 నెలలుగా పేపర్స్ సివిల్ సప్లైకి పంపివ్వడం లేదు. పేరుకుపోయిన బిల్లులే కాకుండా యాసింగి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమయ్యే ప్యాడీ సీడ్ క్లీనర్ కమ్ గ్రాండర్, 300 కిలోల కెపాసిటీ ఉండే ఎలక్ట్రానిక్ వెహింగ్ స్కేల్, డిజిటల్ మోయిస్టర్ మీటర్, ప్యాడీ లిఫ్టర్ కమ్ క్లీనర్, విన్నోవింగ్ ఫ్యాన్స్ రూ.30 కోట్ల టెండర్స్ పిలిచారు. గతంలో రద్దు చేశారు. చివరిగా తాను అనుకునే కంపెనీలకు వీలుగా వచ్చేలా ఆలస్యంతో ఈ నెల 6న టెండర్లు వేసేలా చేశారు. ఏఎంఆర్ ఆగ్రోకు అనుకూలంగా వ్యవహరించారు. తన మనిషిని పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు పంపించి అక్కడున్న కంపెనీలతో చర్చలు జరిపారు. అంతా అనుకూలంగా జరిగేలా సెట్ చేశారు. 6వ తేదీన ఒంటి గంటకు టెండర్లు వేయడం ముగిసినా, మరో 2 గంటలు పొడిగించారు. అయినా ఆయన అనుకున్న కంపెనీకి రావాలని వేసిన సీల్ను తొలగించి 3.30 గంటలకు డబ్బాలో వేయించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలపై కేంద్రీయ బండార్ సంస్థ ఏఎంఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్పై ఆగ్రోస్ ఎండీ, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది.
Read Also- Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు.. ఎంతంటే?
రైతు సేవా కేంద్రాల సొమ్ముకు ఎసరు
కొనుగోలు కేంద్రాల్లో వస్తువులు, వర్షం వచ్చినా తడవకుండా తీసుకునే జాగ్రత్తలకు సంబంధించి ఆగ్రోస్ టెండర్లకు పిలుస్తుంటుంది. దీనివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని అసెంబుల్డ్ వస్తువులను తెప్పించుకుని తామే సిద్ధం చేసుకునేలా ప్లాన్ చేశారు. అయితే, వీరి వద్ద 20 మంది ఉద్యోగులు మాత్రమే ఉంటారు. రైతు సేవా కేంద్రాల డిపాజిట్ సొమ్ము రూ.20 కోట్లు ఉంది. చింతల్ వద్ద ఆగ్రోస్కు భూమి ఉంది. అక్కడ ఈ మెటీరియల్ తయారు చేసి కొనుగోలు కేంద్రాలకు ఇవ్వాలని యోచిస్తున్నారు. అయితే, యాసింగికి టెండర్లు పిలిచి ఆగ్రోస్కు చెందిన రూ.10 కోట్లు ఇష్టానుసారంగా ఖర్చు చేసేందుకు మళ్లీ అసెంబుల్డ్ మెటీరియల్స్ పేరుతో నాటకాలకు తెర తీశారు. టెండర్లు, ఫిట్టింగ్లు అంటూ కమీషన్లు, దుబారా ఖర్చుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇకపై స్వేచ్ఛ వరుస కథనాలు
టెండర్లలో రాద్దాంతం, రద్దు కావడానికి సిండికేట్ గ్యాంగులతో పాటు ధరలను ముందే పసిగట్టే సాఫ్ట్వేర్ మాయగాళ్లు ఉన్నారు. నామినేషన్ పద్దతిలో దర్జాగా దోచుకునే మాఫియాలు ఉన్నాయి. వారిపై ఇకపై ‘స్వేచ్ఛ’ (Swetcha) వరుస కథనాలు. ఆదా చేయాల్సిన ప్రజాధనాన్ని ఎలా, ఎక్కడెక్కడ కోట్టేశారో పార్టుల వారీగా ప్రత్యేక కథనాలు, స్వేచ్ఛాయుతంగా మీ ముందు ఉంచుతాం.
Read Also- BRS on Congress: తెలంగాణ మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి..!