- ఖాజాగూడ భూముల కేసులో ప్రతివాదులకు నోటీసులు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్పై హైకోర్టు విచారణ
- రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
- కబ్జాలపై ఆధారాలతో సహా ముందే ప్రచురించిన ‘స్వేచ్ఛ’
- ‘వంశీరాం టు సోహిణి లిటిగేషన్స్ సో మెనీ’ పేరుతో కథనాలు
- 27 ఎకరాలు.. 3వేల కోట్ల గుట్టంతా బయటపెట్టిన ‘స్వేచ్ఛ’
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్
Khajaguda Lands: ఖాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సోహిణి బిల్డర్స్తోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
దర్జాగా భూముల కబ్జా
శేరిలింగంపల్లి మండలంలోని ఖాజాగూడ సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, రాజేశ్ రెడ్డిలు ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రికార్డుల్లో ఇది ప్రభుత్వ పోరంబోకు భూమి అని ఉండగా కొందరు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి ప్రైవేట్ భూములని పేర్కొన్నట్టు తెలిపారు. అంతటితో ఆగకుండా నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భూముల్లో ఓ బిల్డర్ 47 అంతస్తుల చొప్పున 8 భారీ టవర్ల నిర్మాణాలను కొనసాగిస్తున్నట్టు తెలియచేశారు. ఇది పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించటమే అని పేర్కొన్నారు. పర్యావరణ నిబంధనలకు కూడా విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని తెలియచేశారు. ఈ భూముల విలువ వేల కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు నిర్మాణాలు జరుపుతున్న సోహిణి బిల్డర్స్తోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also- Chandrababu: ఎవ్వరినీ వదిలిపెట్లొద్దు.. సీబీఎన్ కీలక ఆదేశాలు
ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’
గుట్టుచప్పుడు కాకుండా పోరంబోకు భూమికి లైన్ క్లియర్ చేసిన దగ్గర నుంచి, ఎవరెవరికి ఎంత ముట్టింది, చక్రం తిప్పింది ఎవరు, ఇలా అన్నింటిపై ‘వంశీరాం టు సోహిణి లిటిగేషన్స్ సో మెనీ’ పేరుతో 2024 సెప్టెంబర్ 18న ‘స్వేచ్ఛ’ కథనం ప్రచురించింది. ముందు పోరంబోకు భూమి అని చెప్పిన అధికారులు తర్వాత అనుమతులు ఎలా ఇచ్చారనే దానిపై పక్కా ఆధారాలతో వార్త ఇచ్చింది. ఇప్పుడు అదే భూమికి సంబంధించి కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో హాట్ టాపిక్గా మారింది.
Read Also- Viral News: చొక్కా విప్పేసి.. నడిరోడ్డుపై పొలిటీషియన్ కొడుకు నిర్వాకం