Caste Census Survey: రాష్ట్రంలో బీజేపీ (BJP) మరో కొత్త పంచాయితీకి తెరతీసింది. ఈ సారి కుల గణన పేరిట రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కుల గణన, కుల సర్వే వేర్వేరనే నినాదంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చూస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) అధికారంలోకి వచ్చాక కుల గణన చేపట్టింది. అయితే, ఈ సర్వే తప్పని చెబుతూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించాయి. అయినా అవన్నీ లెక్క చేయకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును సైతం కాంగ్రెస్ తీర్మానం చేసింది. దాన్ని కేంద్రానికి పంపించింది. దీనివల్ల కాంగ్రెస్కు ఎక్కడ పేరొస్తుందోననే భయంతో బీజేపీ కుల గణన చేపడుతామని చెబుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీ యూటర్న్
గతంలో కులగణన అంశంపై బీజేపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడారు. తాము కుల గణన చేపట్టబోమని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) సుప్రీంకోర్టు (Supreme Court)లో అఫిడవిట్ సైతం దాఖలు చేశారనే విమర్శలు ఉన్నాయి. కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ గత స్టాండ్కు భిన్నంగా కుల గణన చేపడుతామని ప్రకటించడాన్ని కాంగ్రెస్ సైతం సమర్థించింది.
క్రెడిట్ మాదే అంటున్న కాంగ్రెస్
అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం తమ పోరాట ఫలితమేనని చెబుతోంది. ఇదంతా రాహుల్ గాంధీ వల్లేనని హస్తం నేతలు చెబుతున్నారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ఒక ప్రయత్నంగా జన గణనలో కుల గణన చేపట్టినా ఆ వివరాలను మోదీ సర్కార్ ఆమోదించలేదనే విమర్శలు ఉన్నాయి. రాహుల్ గాంధీ పోరాటం వల్ల ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుల గణనకు సానుకూలంగా ఉండడం ముమ్మాటికీ తమ చొరవేనని హస్తం నేతలు నొక్కి చెబుతున్నారు.
కుల గణన, కుల సర్వే వేర్వేరా?
తెలంగాణలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ఢీ అంటే ఢీ అంటున్నాయి. కుల గణన నిర్ణయం కాంగ్రెస్ విజయమేనని బల్లగుద్ది మరీ హస్తం నేతలు చెబుతున్నారు. దీంతో మొదటికే మోసం వచ్చే అవకాశముందని భావించి బీజేపీ కుల గణన, కుల సర్వే రెండూ వేర్వేరనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. కాంగ్రెస్ వైఖరితో తమకు డ్యామేజ్ ఎక్కడ జరుగుతుందోనని భావించి ఈ నిర్ణయానికి కమలనాథులు వచ్చారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది.
బీజేపీ విషప్రచారం!
బ్రిటీష్ కాలం తర్వాత ఎవరూ కులగణన చేపట్టలేదనే విష ప్రచారానికి కమలం పార్టీ సిద్ధమవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో గతంలో చేసిన జన గణన, కుల గణన ప్రస్తావనను దాచేందుకు కుల గణన, కుల సర్వే వేర్వేరని ప్రజలకు వివరించాలని చూస్తున్నది. అంతేకాకుండా కుల సర్వేకు చట్టబద్ధత లేదని, సెన్సెస్ ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామనే విషయాన్ని సైతం ప్రజలకు ఇప్పుడు వివరించాలని కమలం పార్టీ వ్యూహం రచించుకుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ కులగణన కేవలం ఎన్నికల డ్రామాగా విమర్శలకు దిగింది. అదంతా తప్పుల తడక అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది.
Also Read: Dog Attacks Owner: ఓరి దేవుడా.. యజమాని ప్రైవేటు పార్ట్స్ పై కుక్క దాడి.. చివరికీ!
కాంగ్రెస్ మైలేజ్ డ్యామేజ్ చేసే ప్లానా?
కాంగ్రెస్ తెలంగాణలో చేపట్టిన కుల గణన, బీసీ రిజర్వేషన్ల అంశంతో హస్తం పార్టీకి మైలేజ్ పెరిగింది. అందుకే, బీజేపీ ఈ కొత్త వ్యూహరచనకు తెరతీసిందనే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశంతో ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మరింత అడ్వంటేజీగా మారే అవకాశముంది. అది కమలం పార్టీకి నష్టం జరిగేందుకు దారి తీస్తుంది. అందుకే ఎన్నికల్లో కాస్తో కూస్తో గెలిచి గట్టెక్కాలంటే ఈ తరహా వ్యూహం తప్పదనే అంచనాకు కమలం పార్టీ వచ్చినట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి చర్యలకు కాషాయ పార్టీ దిగుతున్నదని ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.