తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కులగణన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ విసిరిన మాస్టర్ స్ట్రోక్తో బీఆర్ఎస్ విలవిలలాడుతున్నది. బీసీ ఓటు బ్యాంకు చేజారిపోతున్నదేమోననే అనుమానంతో హడావిడిగా బీసీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే బీసీ ఇష్యూతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చాంపియన్గా అవతరించారని, సొంత పార్టీలోనే ఆమె పవర్ సెంటర్గా మారారన్నది పార్టీ నాయకత్వానికి మింగుడుపడడంలేదు. ఆమెను ఒంటరిని చేయడానికి బీసీ అంశాన్ని ఎత్తుకుని ఆమెకు ఎజెండా లేకుండా చేయాలని భావించింది.
ఈ ఇష్యూతో అటు సీఎం రేవంత్ను, ఇటు ఎమ్మెల్సీ కవితను ఎదుర్కోవచ్చని, ఇంకోవైపు బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చని లీడర్షిప్ భావిస్తున్నది. ఇంతకాలం బీసీ సంఘాలను పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు కులగణన అంశాన్ని టేకప్ చేసి తప్పులతడక అంటూ ప్రభుత్వాన్ని విమర్శించే అస్త్రాన్ని ఎంచుకున్నది. త్వరలో జిల్లాల స్థాయిలో బీసీ సభలను నిర్వహించాలని భావిస్తున్నది.
బీఆర్ఎస్లో బీసీ చాంపియన్గా కవిత
ఫూలే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో గతేడాది జనవరి 30న ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏడాది కాలంలో దాదాపు 80 బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కులాలవారీగా కూడా సంఘాల నేతలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన సభకు వివిధ కుల సంఘాల నుంచి మద్దతు లభించింది.
పార్టీకంటే ముందే ఇష్యూను టేకప్ చేసిన కవిత ఈ అంశంలో పవర్ సెంటర్గా మారుతున్నారని నాయకత్వం అనుమానిస్తున్నది. ఈ అంశాన్ని చేజిక్కించుకుని కవితకు మాట్లాడే అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీసీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఆమెను ఆహ్వానించలేదు. త్వరలో బీసీ అంశంలో పార్టీ చేపట్టనున్న యాక్టివిటీని, జిల్లాల స్థాయిలో సభల నిర్వహణపై కేటీఆర్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.
Also Read : రాష్ట్రానికి భారీ పెట్టుబడులు… అందరి కన్ను ఆ భూములపైనే!
MLC Kavitha | కవితను ఒంటరి చేసే ప్రయత్నాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనకుండా ఆమెను దూరం పెట్టిన నాయకత్వం ఇప్పటికీ అదే వైఖరిని ప్రదర్శిస్తున్నది. పార్టీ సమావేశాలకు ఆమెను ఆహ్వానించడంలేదు. ఒకవేళ పిలిచినా వేదికపై మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వడంలేదు. కులగణన విషయంలోనూ శాసనమండలిలో మాట్లాడేందుకు మధుసూదనాచారి, ఎల్ రమణ, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్లకు మాత్రమే మాట్లాడేందుకు పార్టీ నాయకత్వం అనుమతి ఇచ్చింది.
కవితకు చాన్స్ ఇవ్వకపోవడం ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేయడమేనని ఆమె అభిమానులు, జాగృతి కార్యకర్తలు నొచ్చుకున్నారు. బీసీ ఇష్యూలో పార్టీకంటే ముందుగానే చొరవ తీసుకుని డెడికేటెడ్ కమిషన్కు 33 పేజీల నోట్ ఇచ్చారని, సమస్యలను ప్రస్తావించారని వారు గుర్తుచేశారు. ఇప్పుడు ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండా, హాజరయ్యేందుకు ఆహ్వానించకుండా బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కావడం వివాదాస్పదమైంది.
సీఎం రేవంత్ ప్లాన్తో కేటీఆర్లో ఆందోళన
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలు రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్, బ్యాంకుల ద్వార స్వయం సహాయక బృందాలకు రుణ సౌకర్యం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో మహిళా సంఘాలకు ప్రాధాన్యత తదితరాలతో మహిళా ఓటు బ్యాంకును కాంగ్రెస్ స్ట్రాంగ్ చేసుకున్నది. పంట రుణాల మాఫీ, రైతుభరోసా, వడ్లకు బోనస్ తదితరాలతో రైతాంగాన్ని ఆకట్టుకున్నది. ఇప్పుడు కులగణన కారణంగా బీసీలకు సైతం కాంగ్రెస్ దగ్గరైంది.
ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయాలతో కకావికలమైన బీఆర్ఎస్ ఇప్పుడు బీసీ అంశాన్ని టేకప్ చేసింది. పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ మౌనంగా ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పనితీరుపై చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేదు అనుభవాలు వస్తే అపవాదు మూటగట్టుకోవాల్సి ఉంటుందనే ఆందోళన మొదలైంది. ఒకవైపు కవిత హైపర్ యాక్టివిటీ, మరోవైపు హరీశ్రావుతో పోటీ కారణంగా డైలమాలో పడిన కేటీఆర్ హడావిడిగా బీసీ ఇష్యూను ఎత్తుకున్నారు.
కేటీఆర్ ముందు అనేక సవాళ్లు
ఏక కాలంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న కేటీఆర్.. బీసీ రిజర్వేషన్పైనా, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంపైనా, సీఎం రేవంత్ వ్యూహాన్ని ఢీకొట్టడంపైనా, బీసీ సంఘాల విశ్వాసాన్ని చూరగొనడంపైనా ఏ మేరకు సక్సెస్ అవుతారన్న చర్చ ఆ పార్టీ లీడర్లలో మొదలైంది. రానున్న రోజుల్లో ఆయన ఎలాంటి పలితాలను సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కవితను, హరీశ్రావును ఎదుర్కోవడం, శ్రేణుల్ని కాపాడుకోవడం, గ్రామ స్థాయిలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కాకుండా నిలబెట్టడం.. వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి.