- ఇన్నాళ్లూ కేసీఆర్ కుమార్తెగా గౌరవం
- రోజురోజుకూ పార్టీని డ్యామేజ్ చేసేలా చర్యలు
- ఇక ఊపేక్షించేది లేదంటున్న గులాబీ నేతలు
- ఇతర పార్టీలకు అవకాశం ఇస్తుండడంపై అనుమానాలు
- ఒపిక పట్టింది చాలు.. ఇక డైరెక్ట్ ఎటాక్
- అజ్ఞాత శక్తిపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్న గులాబీలు
- ఇప్పటికే ఒంటరై అయోమయ పరిస్థితి
- రానున్న రోజుల్లో కవితకు అన్నీ కష్టాలేనా?
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్
Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అంతా నా ఇష్టం, నేను కేసీఆర్ కూతుర్ని, ఏది చెబితే అదే ఫైనల్ అనే ధోరణిలో ఇన్నాళ్లూ నడిచింది. కానీ, ఇప్పుడా ఆటలు సాగడం లేదు. ఆధిపత్య పోరు కొనసాగుతుండడం, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, నా ఓటమికి పార్టీ నేతలే కారణం అంటూ కవిత పదేపదే చెబుతుండడంపై తిరుగుబాటు మొదలైనట్టు సమాచారం. అసలు, ఎవరు దెయ్యం, ఇన్నాళ్లూ అజ్ఞాత శక్తిగా సాగించిన ఆధిపత్య పోకడలపై నిలదీసేందుకు గులాబీ నేతలు సిద్ధమైనట్టు చర్చ జరుగుతున్నది.
లేఖతో మొదలైన వార్
ఏ ముహూర్తాన కేసీఆర్కు కవిత లేఖ రాశారో కానీ, అప్పటి నుంచి బీఆర్ఎస్లో వార్ మొదలైంది. కేటీఆర్తో ఆధపత్య పోరు అని స్పష్టంగా అర్థం అవుతున్నది. ఇదే క్రమంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, తన ఓటమికి సొంత పార్టీ వాళ్లే కారణం అని చేసిన కామెంట్స్తో పార్టీ సీనియర్లు, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ నేతలంతా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారని సమాచారం. ఇకపై ఆమె వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని మాటకు మాట బదులివ్వాలని గులాబీ నేతలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. గతంలో కేసీఆర్ కూతురిని అనే గర్వంతో చేసిన దబాయింపు అంతా ఇకపై సాగనిచ్చేది లేదని నేతలు ఒక్కమాట మీదకు వచ్చినట్టు సమాచారం.
కేసీఆర్ కూతురు అయితే ఏం చేసినా నడుస్తుందా?
ఓవైపు జాగృతి పేరుతో ప్రత్యేక టీమ్ను సిద్ధ చేసుకుంటున్న కవిత, ఇంకోవైపు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తున్న తీరుపైనా గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. అసలు ఆమె ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదంటూ సెటైర్లు వేస్తుంటే, ఉద్యమ పార్టీగా పేరుగాంచిన బీఆర్ఎస్కు తలవంపుగా ఉన్నదని గులాబీ నేతలు తెగ మదనపడిపోతున్నట్టు సమాచారం. కేసీఆర్ కుమర్తె కాబట్టి ఇన్నాళ్లూ ఏం చేసినా నడిచింది. తను చెప్పిందే వేదం అనే ఊహల్లో ఇంకా ఉంటే ఎలా అని తెగ మాట్లాడుకుంటున్నారు. వీరిలో కవితకు దగ్గర మనుషులు కూడా ఉండడం గమనార్హం. ఆమె వ్యవహరిస్తున్న తీరుతో గతంలో లబ్ధి పొందిన నేతలు సైతం దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఎప్పుడూ ఎలా ఎటు టర్న్ తసుకుంటారో తెలియక, ఆమె రాజకీయ వ్యూహం ఏమిటో అర్థంకాక కొంతమంది సతమతమవుతున్నారని తెలిసింది. కవిత అనుచరులుగా ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేసినట్టు సమాచారం.
Read Also- Earth: భూభ్రమణంలో అస్సలు ఊహించని మార్పు.. ఏం జరగబోతోంది?
బీఆర్ఎస్లో ఉంటూ జాగృతి ఎందుకు?
కవిత బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూనే జాగృతి సంస్థ పేరుతో కార్యక్రమాలు స్పీడ్ పెంచారు. సంస్థ అనుబంధ కమిటీలతో పాటు దేశ, విదేశాల్లోనూ కమిటీలు వేస్తున్నారు. మరోవైపు, బీసీ రిజర్వేషన్లపై పోరాటం, ఇరిగేషన్ పైనా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. అయితే, రాజకీయ వ్యూహం లేకుండానే పార్టీని కాదని, జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, కేటీఆర్, హరీశ్ రావుపై పరోక్ష విమర్శలు చేస్తుండడం గులాబీ నేతలకు నచ్చడం లేదు. దీంతో ఆమెతో ఉంటే రాజకీయంగా ఎదగలేమని భావించిన జాగృతిలో కీలకంగా పనిచేసి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అయినవారు ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఒక్కొక్కరుగా దూరమవుతున్న నేతలు
బీఆర్ఎస్ పార్టీని కాదని కవిత అనుసరిస్తున్న తీరుతో కేసీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పడుతున్నదనే ప్రచారం సైతం ఊపందుకున్నది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఇది కుటుంబంలోని సభ్యులను టార్గెట్ చేసే ఆరోపణలు చేశారని అర్థం అవుతున్నది. అందుకే, కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉంటున్నారు. ఆమె ఏ కార్యక్రమం చేసినా ఒకరిద్దరు నాయకులు కూడా పాల్గొనడం లేదు. కేవలం జాగృతి సంస్థ, ఫూలే ఫ్రంట్ నేతలు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే, ఫూలే ఫ్రంట్లో గతంలో కీలకంగా వ్యవహరించిన నేతలు సైతం ఇప్పుడు ఆమెకు దూరంగా ఉంటున్నారని సమాచారం. మొత్తంగా బీఆర్ఎస్లో ఒంటరైన కవిత విమర్శలపై ఇకపై మౌనంగా ఉండాల్సిన పని లేదని గులాబీ నేతలు డిసైడ్ అయినట్టు సమాచారం.
Read Also- The 100: ఆర్కే సాగర్ ‘ది 100’కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ సపోర్ట్!