– శనివారం ఉదయానికే ఖాళీగా హైదరాబాద్ రోడ్లు
– వరుస సెలవుల నేపథ్యంలో జనం గ్రామాల బాట
– బస్సులు, రైళ్ల కిటకిట
– కొందరు సొంత వాహనాలలో ఊళ్లకు పయనం
– తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ
Polling: నాలుగో విడత పార్లమెంట్ ఎన్నికలు ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నగరాల్లో ఉండే జనం సొంతూళ్లకు పయనం అయ్యారు. ముఖ్యంగా ఓటేసేందుకు హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ ఓటర్లు సొంత ఊళ్లకు పయనమయ్యారు. సెకెండ్ సాటర్ డే, సండే, మండే (ఎలక్షన్ డే) వరుస సెలవులు రావడంతో జనం ఊళ్లకు పోటెత్తారు. శనివారం ఉదయమే హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనిపించాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లకు జనం పోటెత్తారు. మరికొందరు సొంత వాహనాలపై ఊళ్లకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. హైదరాబాద్ మహా నగరంలో లక్షల్లో ఆంధ్రా ప్రజలు జీవనం సాగిస్తున్నారు. గతంలో పండుగలు, ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలకు వరుసగా సెలవులు వచ్చినప్పుడు సొంత ఊళ్లకు పయనమయ్యేవారు. ఇప్పుడు ఎన్నికలు, వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా జనం పోటెత్తారు. చాలా మంది ఓటు వేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి చాలా మంది తమ ఊర్లకు బయలు దేరారు. శనివారం ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ఏపీకి బయలు దేరారు. ఈ క్రమంలోనే విజయవాడ వైపు వెళ్లే వాహనాలు టోల్ గేట్ల వద్ద భారీగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి.
కొర్లపాడు టోల్ గేట్ వద్ద రద్దీ
నగర శివార్లలో ఉన్న కొర్లపాడు టోల్ గేట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచాయి. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ లేట్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఊళ్లకు వెళ్లే వాళ్లు అనుకున్న సమయం కంటే కాస్త ముందుగా బయలు దేరితే, గమ్యస్థానాలకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే నగరంలోని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడేతో సొంతూళ్లకు పయనమయ్యారు.
Also Read: సారు..కారు..మిడ్ మానేరు
వెబ్ సైట్లో సాంకేతిక సమస్య
ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్ సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో సీటు రిజర్వేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రిజర్వేషన్ వెబ్ సైట్లో తరచూ సాంకేతిక సమస్య తలెత్తుతోంది. టికెట్ బుకింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. టికెట్ బుక్ అయినట్లు చూపిస్తోంది. డబ్బులు కూడా కట్ అవుతున్నాయి. కానీ కన్ఫామ్ అయినట్లు మెసేజ్ రావడం లేదు. ఆన్ లైన్లో డబ్బులు విత్ డ్రా అయిన వెంటనే సాంకేతిక సమస్య చూపిస్తోంది. టికెట్ బుకింగ్ నెంబర్ కూడా వెబ్ సైట్లో చూపించడం లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.