Bayya Sunny Yadav: ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్(భయ్యా సందీప్) (Bayya Sunny Yadav) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బైక్పై దేశ విదేశాలు తిరుగుతూ పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియా (Social Media) లో ఫాలోవర్స్ను పెంచుకుని ప్రముఖ యూట్యూబర్గా మారాడు. కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్లో ఇతను పేరు బాగా వినపడింది. అంతక ముందే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ నూతనకల్ పీఎస్లో ఒక కేసు నమోదైంది. టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) లో దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కాస్త స్ట్రాంగ్గానే చెబుతూ, పోలీసులకు వివరించారు. దీంతో, నూతన్కల్ పోలీస్ స్టేషన్లో భయ్యా సందీప్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్వేష్ ముందే చెప్పాడు
‘నా అన్వేషణ’ అన్వేష్ కూడా ఇతడి గురించి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని , ఏదో ఒక రోజు అతన్ని అరెస్ట్ చేస్తారని చెబుతూ చెప్పాడు. అతను ఏదైతే చెప్పాడో చివరకు అదే జరిగింది. తాజాగా పోలీసులు సన్నీ యాదవ్ను చెన్నై ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ బైక్ టూర్ను ముగించుకుని మన దేశానికి వచ్చాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చెన్నై ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్కు సంబంధించి సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడని అంతా అనుకున్నారు. కానీ, పోలీసులు అతడిని అందుకు కాదు అరెస్ట్ చేసింది.
పాకిస్థాన్ లింకులు?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ క్రమంలోనే ఉగ్ర మూకల స్థావరాలను నాశనం చేసింది. ప్రతిగా పాకిస్థాన్ దాడులకు తెగబడింది. భారత బలగాలు దాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్లోని స్లీపర్ సెల్స్పై ఇంటెలిజెన్స్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్కు గూఢచర్యం చేసినట్టు బయటపడింది. పాక్ అధికారులతో చాలా క్లోజ్గా తిరిగిన జ్యోతి మూడుసార్లు అక్కడ పర్యటించి అనేక వీడియోలు చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడికి ముందు కూడా పాకిస్థాన్ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో పాక్ వెళ్లి వస్తున్న వారిపై నిఘా పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నీ యాదవ్ పాక్ వెళ్లొచ్చానని పోస్ట్ పెట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అక్కడి పర్యటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. అతడికి పాక్లోని ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? గూఢచర్యానికి పాల్పడుతున్నాడా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.