Sonu Sood: నేటి డిజిటల్ యుగంలో ఆహారం కంటే ఎక్కువగా పిల్లలు డేటాను భుజిస్తున్నారు. ముద్ద ముద్దకు మొబైల్ స్క్రోలింగ్ చేస్తూ, పక్కనే ఉన్న తల్లిదండ్రుల ఉనికిని కూడా మర్చిపోతున్న ప్రస్తుత పరిస్థితులపై ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ (Sonu Sood) గళమెత్తారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలంటూ ఆయన చేసిన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ‘‘చిన్న పిల్లలు తింటూ స్క్రోల్ చేస్తున్నారు, తల్లిదండ్రులు అది గమనించడం లేదు.. ఇది మన భవిష్యత్తు కాకూడదు’’ అంటూ సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వపు కాలంలో భోజనం చేసేటప్పుడు ఇంట్లో పెద్దలు చెప్పే కథలు, ముచ్చట్లు పిల్లలకు మంచి పాఠాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు రీల్స్ రాజ్యమేలుతున్నాయి. దీనివల్ల పిల్లల్లో ఏకాగ్రత లోపించడం, సామాజిక సంబంధాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తున్నాయని సోనూ సూద్ హెచ్చరించారు.
Also Read- Amardeep Chowdary: ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా!
16 ఏళ్ల లోపు వారందరికీ నిషేధం
సోషల్ మీడియా (Social Media) అనేది ఒక మాయాజాలంగా మారింది. సోషల్ మీడియాలో ఉండే కంటెంట్.. పిల్లలకు అంత సురక్షితం కాదు. సైబర్ బుల్లీయింగ్, అశ్లీలత, అనవసరమైన పోలికల వల్ల చిన్న వయసులోనే పిల్లలు డిప్రెషన్కు గురవుతున్నారు. అందుకే, 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం అనేది కాలక్షేపం కోసం చేసే ఆలోచన కాదు, అది నీడ్ ఆఫ్ ది అవర్ అని సోనూసూద్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చర్చలు, చర్యలు మొదలుపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీ బాటలోనే గోవా కూడా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి సోనూసూద్ ఓ విన్నపం చేశారు. ఈ అంశాన్ని ఒక జాతీయ ఉద్యమంగా (National Movement) మార్చాలని, దేశవ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నియంత్రించేలా చట్టాలు రావాలని ఆయన కోరారు.
Also Read- The Raja Saab: భారీ నష్టాలకు కారణం ఆ ఇద్దరేనా? నిర్మాతను నిలువునా ముంచేశారా?
ప్రాథమిక మార్పు మాత్రం ఇంట్లోనే..
ప్రస్తుతం సోనూసూద్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మీ నిర్ణయానికి మేమంతా ఏకీభవిస్తున్నాం సార్.. అంటూ నెటిజన్లు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఒక వేళ యాక్సెస్ ఉన్నా.. అది పేరేంట్స్ చేతుల్లో ఉండేలా ఉండాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం అన్నిటికంటే ఇదే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.. మరి ప్రధాని ఎలా రియాక్ట్ అవుతారో? అయితే.. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ప్రాథమిక మార్పు మాత్రం ఇంట్లోనే మొదలవ్వాలి. స్మార్ట్ ఫోన్ కంటే స్మార్ట్ పేరెంటింగ్ ఇప్పుడు చాలా ముఖ్యం. సోనూ సూద్ లేవనెత్తిన ఈ పాయింట్ ప్రతి పేరేంట్స్ను ఆలోచింపజేసేలా ఉంది. పిల్లల చేతిలో ఫోన్ ఇచ్చి మనం ప్రశాంతంగా ఉండటం కాదు, వారి బాల్యాన్ని వారికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఈ ఉద్యమం ఇప్పుడవసరం అని చెప్పకతప్పదు.
Children scrolling while eating, parents staying unaware—this can’t be our future. A social media ban below 16 is the need of the hour. AP has begun, Goa may follow. Hoping Hon’ble PM @narendramodi ji makes this a national movement.
— sonu sood (@SonuSood) January 30, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

