OTT Controversy: ఇప్పటి వరకు సినిమా స్టోరీలను కాపీ కొడుతున్నారనే విన్నాం. ఇప్పుడు వెబ్ సిరీస్ల స్టోరీలు కూడా కాపీ కొడుతున్నారు. ముఖ్యంగా కొరటాల శివ చేసే సినిమాలన్నీ కాపీ కథలే అంటూ.. ఆయన సినిమాలు విడుదలైన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద రచ్చే నడుస్తుంటుంది. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ నిర్మాతలు మా వెబ్ సిరీస్ కథని కాపీ కొట్టారంటూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. వెబ్ సిరీస్లకూ ఈ జాడ్యం పట్టుకోవడంతో.. ఇండస్ట్రీలో మరోసారి కథల కాపీపై కథనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఒకేసారి తెలుగులో ఒకే కథతో రెండు వెబ్ సిరీస్లు తెరకెక్కాయి. ఒకటి ఈటీవీ విన్ ఒరిజినల్ ‘కానిస్టేబుల్ కనకం’ (Constable Kanakam) అయితే మరొకటి జీ 5 ఒరిజినల్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viratapalem: PC Meena Reporting). అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుని జూన్ 27న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
Also Read- Varalaxmi Sarathkumar: పెళ్లైన ఏడాదికే వరలక్ష్మి ఇలా చేసిందేంటి.. భర్త పరిస్థితేంటి?
మరో వైపు వర్ష బొల్లమ్మ టైటిల్ పాత్రలో నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ మాత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సిరీస్ ప్రశాంత్ కుమార్ దర్శకుడు. అసలు విషయం ఏమిటంటే.. జీ వాళ్లకి ఈ కథని ప్రశాంత్ ఎప్పుడో చెప్పారట. వాళ్లకు కథ నచ్చింది.. సిరీస్ మొదలవ్వాల్సిన టైమ్లో కొన్ని కారణాలతో ఆగిపోయింది. అదే కథ ఈటీవీ విన్ దగ్గరకు వెళ్లగా.. వాళ్లు ఈ కథని టేకప్ చేశారు. ఈలోగా జీ వాళ్లు అదే కథతో ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ పేరుతో వెబ్ సిరీస్ను పూర్తి చేశారు. రీసెంట్గా విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశాక.. ఈటీవీ విన్ వాళ్లకి అనుమానం వచ్చింది. ఇది మన కథ కదా.. అని నిర్దారించుకొని ఇప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించి, వివరాలు తెలిపారు.
Also Read- Chiranjeevi: ప్లీజ్.. చిరంజీవి ఇజ్జత్ తీయకండ్రా!
ఈ మీడియా సమావేశంలో దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ని అందరం చాలా కష్టపడి చేశాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక మంచి సందర్భం చూసుకుని మీడియా సమావేశం నిర్వహించాలని అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదు. ఈ మధ్యకాలంలో ఇదే కథతో వేరే ఓటీటీ సంస్థ నిర్మించిన ఒక ట్రైలర్ చూశాము. అది చూసి మేము షాక్ అయ్యాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించాము. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. నిజానికి ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని మేము ఊహించలేదు. చాలా బాధగా ఉంది. ఒక దర్శక, రచయితగా నా కథని ఎంతో మందికి చెప్తాను. ఈ క్రమంలో ఒక సంస్థకి నేను కథ చెప్పడం జరిగింది. మెయిల్స్ రూపంలో కథని వాళ్లకి పంపడం జరిగింది. కొంత వర్క్ అయిన తర్వాత వాళ్లు వద్దనుకున్నారు. వద్దనుకున్న వాళ్లు నా కథని కూడా వదిలేయాలి కదా. నేను నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అలా ఈటీవీ విన్ వాళ్లకి కథ చెప్పగా, వారికి నచ్చింది. ఇక్కడ ప్రాజెక్టు సెట్స్పైకి తీసుకెళ్ళాం. ఇలా ఇప్పుడు అదే కథతో ఆ సంస్థ నుంచి సిరీస్ ట్రైలర్ కనిపిస్తుంది. నా దగ్గర అన్ని ఆధారాలు వున్నాయి. అందుకే, ఈ విషయంలో మేము న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకన్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు