NTR Death Anniversary: జనవరి 18, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) 30వ వర్ధంతి (NTR Death Anniversary) సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఫిల్మ్నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి సినీ పరిశ్రమకు చెందిన పలు శాఖల ప్రముఖులు పూల మాలలతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరవడంతో భారీగా జనం హాజరయ్యారు. పలు చోట్ల అభిమానులు అన్నదానాలను నిర్వహించారు. ఇక ఫిల్మ్నగర్లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా చరిత్రలో నంబర్వన్ ఎన్టీఆర్. ఆయన ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించకపోతే ఈరోజున చాలామంది రాజకీయాల్లో, పదవుల్లో ఉండేవారే కాదు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు. ఇప్పుడు ఇద్దరూ లేరు. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) విగ్రహం కూడా ఫిల్మ్నగర్లో పెట్టాలని నా కోరిక. అందుకు పరిశ్రమ పెద్దలు కృషి చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Also Read- Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర.. ఎందుకో తెలుసా?
అన్నగారు లేరని ఏరోజు అనుకోలేదు
‘తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు జాతికి, సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి. దానికోసం మనమంతా కృషి చేయాలి’ అని మాదాల రవి అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మనదేశం’ చిత్రంలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ప్రకారమే.. ఆయన ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలిసిందే! ఆయన మనల్ని విడిచి 30 ఏళ్లు దాటినా… ఇప్పటికీ మా అందరికీ సజీవంగా వచ్చి పలకరిస్తునట్టే ఉంటుంది. అన్నగారు లేరని ఏరోజు అనుకోలేదని అన్నారు. ‘ప్రతి నటుడికి నందమూరి తారకరామారావు ఓ శిక్షణాలయం. ప్రతి నటుడు, రాజకీయ నాయకుడు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగువాడి పౌరుషం, పరాక్రమం ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్’ అని అన్నారు ప్రసన్నకుమార్.
Also Read- NTR Statue Controversy: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. వైసీపీ వింత వాదన.. ఎక్కడో కొడుతుంది సీనా?
విగ్రహాలు పెట్టేది అందుకే..
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎన్టీఆర్. స్వార్థంలేని మనిషి ఆయన. సినిమాల్లో ఆయన చేయని ప్రయోగం లేదు.. కథ లేదు. అలాంటి వ్యక్తిని ఏడాదికి ఓసారి జయంతి, వర్ధంతి అంటూ గుర్తు చేసుకొని, పూల మాలలు వేసి నివాళులు అర్పించడం కాదు.. రాజకీయంలో అయినా, సినిమాల్లో అయినా ఆయన్ను ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఉండాలి. ఇవాళ ఎంతమందిలో ఆ ధైర్యం ఉంది? ఆయనలా స్వార్థం లేకుండా ఈ రోజున రాజకీయం చేయగలరా? చేయాలనే ఆలోచన జనాల్లో రావాలంటే ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వై.వి.ఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో గొప్ప వ్యక్తులకే ఇలా విగ్రహాలు పెడుతుంటారు. ఎందుకంటే, తద్వారా భావితరాలకు వారి చరిత్ర తెలియాలని. కొందరు అవతార పురుషులు, మహానుభావులకే జననం- మరణం అని కాకుండా జయంతి, వర్ధంతి అని చెబుతాం. అలాంటి ప్రయాణం నందమూరి నటసార్వభౌముడిది. ఆయన వెండితెర వేల్పుగా నిలిచారు. అంకితభావం, కార్యదక్షత, క్రమశిక్షణగా ఉండి అగ్రగామిగా ఎదిగారు. మద్రాసీలు అని పిలవబడుతున్న తెలుగువారిని.. తెలుగుజాతి అని ప్రపంచవ్యాప్తంగా మన ఉనికిని చాటి చెప్పారు’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో నందమూరి జానకీరామ్ భార్య దీపిక, మోహనరూప తదితరులు పాల్గొని ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

