Nandamuri Mokshagna: నందమూరి నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ విషయంలో నందమూరి అభిమానులందరూ నిరుత్సాహంలో ఉన్నారు. కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు బాలయ్య (Nandamuri Balakrishna) తన వారసుడిని దించుతాడా? అని ఇప్పుడు కాదు.. దాదాపు 5 ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదిగో అనేలా వార్తలు రావడం, ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశపడుతుండటం వారికి అలవాటు అయిపోయింది. దీంతో, అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా? అనేలా కూడా ఒకానొక సమయంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను, అనుమానాలను బ్రేక్ చేస్తూ.. రీసెంట్గా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఓ వార్త, నందమూరి అభిమానులను ఖుషి చేసింది. ‘హను మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షు ఎంట్రీ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత.. ‘హమ్మయ్యా.. ఎట్టకేలకు మా వాడు అరంగేట్రం చేయబోతున్నాడు’ అని అంతా సంతోషించారు.
Also Read- Mazaka: థియేటర్లలో మెప్పించలేకపోయిన ‘మజాకా’.. మరి ఓటీటీలో?
ఆ సంతోషం కూడా ఎన్నో రోజులు వారికి నిలవలేదు. రేపు సినిమా ఓపెనింగ్ అనే సమయంలో, సడెన్గా మోక్షజ్ఞకు వైరల్ ఫీవర్ రావడం, బాలయ్య ఆ సినిమా విషయంలో వెనకడుగు వేయడం జరిగిపోయాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి తన ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా మోక్షు సినిమాను నిర్మించాలని భావించారు. సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించి గ్రాండ్గా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ, బాలయ్య సడెన్గా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అంతకు ముందు ప్రశాంత్ వర్మ, బాలయ్యని కూడా ఆహా కోసం డైరెక్ట్ చేశారు. బాలయ్య అంటే ప్రశాంత్ వర్మకు ఎంత ఇష్టమో ఆ సమయంలోనే ఆయన బయటపడ్డారు. ఇక ‘హను మాన్’ తర్వాత అతని దర్శకత్వంలోనే మోక్షు ఎంట్రీ అనగానే అందరూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే ప్రశాంత్ వర్మ విడుదల చేసిన ఫొటోల్లో మోక్షజ్ఞని చూసిన వారంతా.. ‘సింబా’ అంటూ సోషల్ మీడియాని కూడా హోరెత్తించారు. సడెన్గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీ వ్యవహారం మొదటికి వచ్చింది.
Also Read- Jack Trailer: ‘మిషన్ బటర్ ఫ్లై’ వర్సెస్ ‘ఆపరేషన్ రెడ్ థండర్’.. ట్రైలర్ ఎలా ఉందంటే?
అసలు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ చేయాల్సిన సినిమా ఉంటుందో? ఉండదో? కూడా చెప్పేవారు కరువైపోయారు. అంతగా ఆ ప్రాజెక్ట్ డైలామాలో ఉంది. ఇలా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఊరించి, ఉసూరుమనిపించిన బాలయ్య అయినా, తమ అభిమానులకు మోక్షు ఎంట్రీపై ఏదైనా చెబితే బాగుండేది. ‘ఆదిత్య 999’ స్టోరీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు తప్పితే.. అది ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ లేదు. బాలయ్య చూస్తే.. తన ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటున్నారే గానీ.. వారసుడి గురించి పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞపై రకరకాలుగా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంకా వారసుడు సిద్ధం కాలేదా? ఏ వారసుడి విషయంలో ఇలా అయితే జరగలేదు. పదును సరిపోదని ఇంకా సాన పడుతున్నారా? అలా అయితే, ఇంకా ఎంతకాలం పడతారు? ఎప్పటి నుంచో ఈ వార్తలు వింటున్నాం. ఇకనైనా మోక్షుకి మోక్షం ఇవ్వండి అంటూ నందమూరి అభిమానులు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి, ఈ విషయంలో నిరాశలో ఉన్న అభిమానులను బాలయ్య ఎలా బుజ్జగిస్తారో? చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు