Mithramandali OTT: థియేటర్లలో ఆశించిన ఫలితం దక్కని ఓ చిత్రం, ఓటీటీ (OTT)లో కొత్త రూపంలో విడుదలై సంచలనం సృష్టిస్తే.. అది కచ్చితంగా చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా, ప్రముఖ నటుడు ప్రియదర్శి పులికొండ, యూట్యూబ్ స్టార్ నిహారిక ఎన్.ఎమ్. ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మిత్రమండలి‘ సరిగ్గా అదే చేసింది. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, నవంబర్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ.. ప్రస్తుతం ఆ ప్లాట్ఫామ్లో టాప్ 5 ట్రెండింగ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే, అది కేవలం ఒక్క పదం చుట్టూ తిరుగుతోంది అదే రీ-ఎడిటింగ్.
ఓటీటీ మార్పులు
‘మిత్రమండలి‘ కథాంశం, నేటి యువతరం స్నేహబంధాలు, సరదాలు, సమస్యల చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు, విమర్శకులు ఈ సినిమాలో మంచి కామెడీ పాయింట్లు ఉన్నప్పటికీ, నిడివి ఎక్కువ అవ్వడం, కొన్నిచోట్ల కథనం సాగదీసినట్లు అనిపించడం, కామెడీ టైమింగ్ దెబ్బతినడం వంటి అంశాలను లేవనెత్తారు. దీని ఫలితంగా, థియేటర్లలో ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో ఒక్క రోజు లోనే ఈ సినిమా థియేటర్లనుంచి నిష్ర్కమించింది. దీంతో ఈ సినిమాకు వచ్చిన ఈ ప్రతికూల స్పందనను చిత్ర బృందం చాలా సీరియస్గా తీసుకుంది. ఓటీటీ విడుదల గురించి ఆలోచించినప్పుడు, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు అదే సినిమాను పూర్తిగా రీ-ఎడిట్ చేయడం.
నిజానికి, చాలా సినిమాలు థియేటర్ల వెర్షన్నే ఓటీటీలో విడుదల చేస్తుంటాయి. కానీ, ‘మిత్రమండలి‘ బృందం ప్రేక్షకుల అభిప్రాయాలకు గౌరవమిచ్చి, రన్టైమ్ను తగ్గించి, అనవసర సన్నివేశాలను తొలగించి, హాస్యం పండించే సీన్లను మరింత ‘షార్ప్’గా, ప్రభావవంతంగా ఉండేలా కొత్త వెర్షన్ను రూపొందించింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో ప్రియదర్శి సోషల్ మీడియాలో ధృవీకరించారు. “మేము నేర్చుకున్నాము, రీ-కట్ చేశాము. మిత్రమండలికి సరికొత్త వెర్షన్ వచ్చింది. ఈసారి మరింత షార్ప్గా, చాలా నవ్వు పుట్టిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.
Read also-The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిజల్ట్పై రష్మిక మందన్నా స్పందనిదే..
ఈ రీ-ఎడిటెడ్ వెర్షన్ను అమెజాన్ ప్రైమ్లో చూసిన ప్రేక్షకులు, సినిమా అనుభూతి పూర్తిగా మారిపోయిందని సానుకూల స్పందన తెలియజేస్తున్నారు. నిడివి తగ్గడం వలన కథనం వేగంగా సాగడం, ప్రియదర్శి, నిహారికల కామెడీ టైమింగ్ మరింత మెరుగ్గా అనిపించడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో, ‘మిత్రమండలి‘ ఓటీటీలో చూసిన ప్రతి ఒక్కరూ మరో నలుగురికి సిఫార్సు చేయడంతో, ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అత్యధికంగా వీక్షించబడిన వాటిలో ఒకటిగా నిలిచింది. థియేటర్ల ఫలితాలతో నిరాశ చెందకుండా, ప్రేక్షకుడి అభిప్రాయానికి విలువ ఇచ్చి, సినిమాను మెరుగుపరిచి ఓటీటీలో విడుదల చేయడం అనేది ఒక సాహసోపేతమైన, కానీ తెలివైన నిర్ణయం. ‘మిత్రమండలి‘ విజయం ఈ కొత్త పద్ధతికి బలమైన ఉదాహరణగా నిలిచింది.
