Manchu Vishnu: ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ చిత్రాలతో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అనేలా చూసేవారు. ఇప్పుడు బాలీవుడ్ కూడా సౌత్ వైపే చూస్తుంది. దక్షిణాది దర్శకుడు బాలీవుడ్ హీరోలతో సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలకు హిట్స్ కరువయ్యాయి. దీంతో అక్కడి ప్రేక్షకులు సౌత్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ సినిమాలకు పోటీగా, ఇంకా చెప్పాలంటే వాటిని మించి సౌత్ సినిమాలు అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా సౌత్, నార్త్ అనే భేదాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇదే విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించారు.
Also Read- Actor: ఫోన్ అంటేనే భయపడుతున్న నటుడు.. తెగ ఫీలయ్యారు!
విష్ణు మంచు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ‘కన్నప్ప’ సినిమా రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించి, చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, మల్లూవుడ్ నుంచి మోహన్లాల్ వంటివారు భాగమవుతున్నారు. వివిధ ప్రాంతాలలోని నటులు ఈ సినిమాలో నటిస్తుండటంతో.. వారి మధ్య సహకార స్ఫూర్తి గురించి విష్ణు మాట్లాడారు. ప్రస్తుతం ప్రేక్షకులు కళాకారులను ప్రాంతాల వారిగా ‘దక్షిణ నటుడు’, ‘ఉత్తర నటుడు’గా విభజించి చూడటం లేదు. ప్రేక్షకులు వారిని తమ సొంత ఇంటి మనుషుల్లా ఆదరిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా దక్షిణాదికి చెందిన చిత్రాలు చాలా వరకు పాన్ ఇండియా వైడ్గా విడుదలవుతున్నాయి. మంచి కంటెంట్తో వచ్చిన అన్ని భాషల చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. దీనిపై విష్ణు మంచు మాట్లాడుతూ.. ప్రస్తుతం మన చిత్రాలు ఉత్తరాది నుంచి ఎక్కువ ప్రేమ, డబ్బును రాబడుతున్నాయి. దీనిని మనం గౌరవించాలి. అక్కడి ప్రేక్షకులందరూ మన సినిమాలపై ప్రేమను కురిపిస్తున్నారు. ఇది మనమందరం అంగీకరించాల్సిన విషయం. ప్రస్తుతం దక్షిణ భారత సినీ ఇండస్ట్రీ కథలపరంగా, కంటెంట్ పరంగా దూసుకెళుతోంది.
Also Read- Vijayashanti: ఆ శాడిజం ఆపండి.. రివ్యూయర్స్పై రాములమ్మ ఫైర్!
ఒకప్పుడు బాలీవుడ్లో మంచి మంచి కథలతో సినిమాలు వచ్చాయి. తమిళ్, మలయాళంలో ఇప్పటికీ వచ్చే సినిమాలు చాలా నేచురల్గా ఉంటాయి. కొన్నాళ్లుగా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎమోషన్స్ ప్రతిధ్వనించే మట్టి కథల్ని చెప్పడం వల్లే మన సినిమాలు విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేను ‘కన్నప్ప’ సినిమా చేస్తున్నాను. మన మట్టిలో పుట్టిన ఈ కథను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ చూసేలా, అత్యున్నత సాంకేతిక పరిణామాలతో రూపొందిస్తున్నాం. సౌత్లోని నాలుగు పరిశ్రమలను కలిపి, బాలీవుడ్తో పోల్చడం సరికాదు. మొత్తం ఇండియన్ సినిమానే అని పేర్కొన్నారు. త్వరలో ఓ బాలీవుడ్ యాక్టర్తో 1940వ దశకంలోని ఓ కథతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని విష్ణు చెప్పుకొచ్చారు. మంచు విష్ణు చెప్పిన ఈ వ్యాఖ్యలను విన్నవారంతా సడెన్గా నార్త్పై ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారో? అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు