Taapsee Pannu: టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లి, అక్కడ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి తాప్సీ పన్ను (Taapsee Pannu), తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న వదంతులపై తీవ్రంగా స్పందించింది. ఇటీవల డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో (Matthias Boe)ను వివాహం చేసుకున్న తర్వాత, తాప్సీ సినిమాలకు గుడ్బై చెప్పి, డెన్మార్క్లో సెటిల్ అయిపోయిందంటూ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ రూమర్స్ కారణంగా తన కెరీర్పై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ తాప్సీ, సోషల్ మీడియా వేదికగా ఘాటుగా సమాధానమిచ్చింది. మొదటి నుంచి తాప్సీపై ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్ వదిలి వెళ్లినప్పుడు, ప్రేమ వ్యవహారం.. ఇలా ఏదో రకంగా ఆమె వార్తలలో నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమెపై వస్తున్న వార్తలకు స్వయంగా తాప్సీనే క్లారిటీ ఇచ్చింది.
Also Read- OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్లో!
ముంబైలోనే ఉన్నా
‘‘నేను ఎక్కడికీ పోలేదు.. ముంబైలోనే ఉన్నాను. ఈ అసత్య ప్రచారాలను దయచేసి ఆపండి’’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తాప్సీ క్లారిటీ ఇచ్చింది. ‘‘ఉదయం పూట వేడి, తేమతో కూడిన ముంబై వాతావరణంలో నేను దోసె తింటూ కూర్చుంటే, నన్ను డెన్మార్క్ వెళ్లిపోయినట్లు ఎలా రాస్తారు? ఈ ప్రచారం వల్ల నాకు అవకాశాలు రావడం లేదు. నేను మరిన్ని మంచి సినిమాలు చేయడానికి సిద్ధంగా ముంబైలోనే ఉన్నాను’’ అని ఆమె పేర్కొంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు కెరీర్కు దూరం అవుతారనే భావన సినీ పరిశ్రమలో బలంగా ఉంది. అయితే, తాప్సీ వంటి నటీమణులు వివాహం తర్వాత కూడా తమ వృత్తిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇలాంటి అవాస్తవ ప్రచారాలు వారి అవకాశాలను దెబ్బతీస్తున్నాయి.
Also Read- Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!
ఆఫర్లు రావడం లేదని ఆవేదన
తాప్సీ లాంటి స్టార్ హీరోయిన్ స్వయంగా ఈ విషయంపై స్పందించి, తన కెరీర్ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేయడం వెనుక, ఆమె ఎంత మానసిక ఒత్తిడికి గురైందో అర్థమవుతోంది. డెన్మార్క్కు సెటిలైనట్లు వస్తున్న వార్తలను నమ్మి, కొందరు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించడం మానేస్తున్నారని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగులో ‘ఝుమ్మంది నాదం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి.. హిందీలో ‘పింక్, తప్పడ్, హసీన్ దిల్రూబా’ వంటి విభిన్న కథా చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు ఈ ప్రచారాలకు చెక్ పెడుతూ, త్వరలోనే కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరిస్తానని తాప్సీ పరోక్షంగా స్పష్టం చేసింది. తన కెరీర్ విషయంలో వదంతులు సృష్టించవద్దని మీడియాను, రూమర్స్ను నమ్మవద్దని ప్రేక్షకులను ఆమె కోరింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
