DDLJ: బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కాజోల్ తాజాగా లీసెస్టర్ స్క్వేర్లో కొత్త కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయెంగే’ మూవీ.. భారతీయ సినిమాల్లోనే అత్యంత ఆదరణ పొందిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రాజ్, సిమ్రాన్ పాత్రలను షారూఖ్ ఖాన్, కాజోల్ పోషించిన విషయం తెలిసిందే. ఆ పాత్రలతో కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాత్రలకు దక్కిన గౌరవమది. యష్ రాజ్ ఫిల్మ్స్లో 30 సంవత్సరాలను పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలోని రాజ్, సిమ్రాన్ పాత్రలకు సంబంధించిన ఐకానిక్ స్టిల్ను కాంస్య విగ్రహంగా రూపొందించారు. ఈ విగ్రహం వరల్డ్ వైడ్గా దక్షిణాసియాలో ఈ చిత్రానికి ఉన్న శాశ్వతమైన పాప్ కల్చర్ను ప్రభావితం చేసేలా సెలబ్రేట్ చేస్తోంది. లండన్ లీసెస్టర్లో విగ్రహ రూపంలో ఆవిష్కరింపబడ్డ తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ‘హ్యారీ పోటర్, మేరి పాపిన్స్ ప్యాడింగ్టన్, సింగింగ్ ఇన్ ది రెయిన్’ వంటి చార్మిత్రాత్మక చిత్రాల్లోని ప్రముఖ పాత్రలతో పాటు.. ‘బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్’ వంటి వాటి సరసన ఇప్పుడీ విగ్రహం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి షారూఖ్ ఖాన్, కాజోల్తో పాటు యష్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయే విదానీ, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాస్ మోర్గన్ హాజరయ్యారు.
ప్రేక్షకుల ప్రేమను పొందుతూనే ఉన్నాం
ఈ కార్యక్రమంలో షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘DDLJ సినిమా స్వచ్ఛమైన మనసుతో ఎంతో ప్రేమించి చేశాం. ప్రేమ గురించి, అది ఎలా మనుషుల మధ్య ఉన్న అడ్డంకులను తొలగిస్తుందో, ప్రేమ ఎక్కువగా ఉంటే ప్రపంచం ఎంత బావుంటుందనే స్టోరీని ఇందులో మేము చెప్పాలనుకున్నాం. అందుకే DDLJ 30 ఏళ్లుగా ఇంతటి ప్రభావం చూపుతుందని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా చూస్తే, DDLJ నా వ్యక్తిత్వంలోని ఒక ముఖ్యమై భాగం. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు.. నేను, కాజోల్ ప్రేక్షకుల నుంచి ప్రేమను పొందుతూనే ఉన్నాం. ఇప్పుడీ గౌరవంతో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మరోసారి ఆ రోజులకు వెళ్లి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ గౌరవాన్ని మాకు ఇచ్చిన యునైటెడ్ కింగ్డమ్ ప్రజలకు, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్షణాన్ని ఈ మూవీకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గం.. నా స్నేహితుడు, దర్శకుడు అదిత్య చోప్రా.. యష్ రాజ్ ఫిలిమ్స్ కుటుంబంతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నేనెప్పటికీ మరచిపోలేని ఒక అద్భుతమైన క్షణం’’ అని తెలిపారు.
ఇలాంటి గౌరవం దక్కిన తొలి భారతీయ సినిమా
కాజోల్ మాట్లాడుతూ… ఈ సినిమా రిలీజైన 30 ఏళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమను పొందుతూ ఉండటం నిజంగా అద్భుతంగా ఉంది. లండన్లో విగ్రహం ఆవిష్కరించిన దృశ్యాన్ని చూసినప్పుడు.. ఆ చారిత్రాత్మక అనుభూతిని మళ్లీ పొందినట్లుగా అనిపించింది. ఇన్ని తరాలుగా అందరితోనూ ట్రావెల్ అవుతోన్న గొప్ప కథ ఇది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న లీసెస్టర్ స్క్వేర్లో ఇలా విగ్రహం ఏర్పాటు చేసిన ఈ క్షణం.. మా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. యునైటెడ్ కింగ్డమ్లో ఇలాంటి గౌరవం దక్కిన తొలి భారతీయ సినిమా కావడమనేది.. మాకు ఎప్పటికీ నిలిచే అనుభూతి ఇది. మా సినిమాను ఇంతకాలం గుండెల్లో ఉంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

