Megastar Chiranjeevi: ఇకపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరును, ఆఖరికి ఆయన గొంతును, ఫొటోలను ఎలా పడితే అలా వాడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కోర్టు ఇంటరిమ్ ఇంజంక్షన్ను మంజూరు చేసింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి 26 సెప్టెంబర్ 2025 తేదీ నాటి I.A. No.6275 of 2025 in O.S. No.441 of 2025లో జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా, మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా యాడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం పిటిషన్లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి, సంస్థ.. చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర గుర్తించదగిన లక్షణాలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం నిషేధించబడింది.
చిరంజీవికి అనుకూలంగా తీర్పు..
దాదాపు నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గౌరవాలందుకున్న చిరంజీవి, తన పేరు, ఫొటో, ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపాంతరం చేసిన (మార్ఫ్ చేసిన) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడం ఆపాలని కోర్టును ఆశ్రయించారు. భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా చిరంజీవి స్థానాన్ని గుర్తిస్తూ.. పేరు, ఫొటోలు తీసుకొని, వీడియో-మీమ్స్ చేసి, అనుమతి లేని విక్రయాలు మొదలైన చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించింది. ముఖ్యంగా డిజిటల్, AI వేదికల ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతిరూపణ వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించి ఈ ఆదేశాలు జారీ చేసింది.
కఠిన చర్యలు తప్పవ్..
ఈ నిషేధాజ్ఞ ప్రకారం ప్రతివాదులు 1 నుంచి 33 వరకు మరియు ప్రతివాది 36 (జాన్ డో).. ఎవరు అయినా సరే.. చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ (ఉదా: “MEGA STAR”, “CHIRU”, “ANNAYYA”), స్వరము, చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించటం నుంచి వెంటనే నిరోధించబడుతున్నారు. అన్ని ప్రతివాదులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించగా.. తదుపరి విచారణను 27 అక్టోబర్ 2025కు నిలిపివేసింది. వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ఉల్లంఘనలు గాని పరువు నష్టం చర్యలుగాని జరిగితే, సంబంధిత పౌర, ఫౌజ్దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.
Also Read- Prabhas Spirit: ట్రీట్ అదిరింది.. బొమ్మ కనబడలేదు కానీ.. ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ మాస్ వైలెంట్!
వి.సి. సజ్జనార్ సలహా..
టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ఫార్ములు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు,సంస్థలు, TRPs పెంచడం, వీక్షణలను, లాభాలను పొందడం వంటి ఉద్దేశాలతో చిరంజీవి పేరు, ఫొటో, గొంతు, లైక్నెస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, తప్పుగా ప్రతిబింబించడం లేదా వక్రీకరించడం చేస్తే, చట్టపరంగా కఠిన చర్యలు అమలు చేయబడతాయని ఈ ఉత్తర్వు స్పష్టంగా హెచ్చరిస్తుంది. దీనిపై అక్టోబర్ 11న చిరంజీవి హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ని కలిసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు ప్రక్రియను ఈ సందర్భాల్లో సమర్థంగా అమలులోకి తేవడం విషయంపై వారి సలహాను కోరారు. ఇటువంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు శిక్షా చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరంపై ఇరువురు సవివరంగా చర్చించారు. చిరంజీవి ఈ చట్టపరమైన చర్య, భారత వినోద రంగంలో వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ప్రాముఖ్యతను బలపరుస్తుందని సజ్జనార్ నొక్కిచెప్పారు. ఈ విషయంలో అమూల్యమైన కృషి చేసిన అడ్వకేట్ ఎస్. నాగేశ్ రెడ్డికి, వారి న్యాయ బృందానికి చిరంజీవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
