Chiranjeevi Charitable Trust: మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఆధ్వర్యంలో దశాబ్దాలుగా నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి సేవలు అందిస్తున్న ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)’కు కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యంత కీలకమైన అనుమతి లభించింది. ఎఫ్సీఆర్ఏ (Foreign Contribution Regulation Act – 2010) కింద నమోదుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలుపుతూ, ట్రస్ట్కు శుభవార్త అందించింది. ఈ తాజా పరిణామంతో, సీసీటీ ఇకపై తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి వీలుగా విదేశీ విరాళాలను (Foreign Donations) స్వీకరించడానికి అవకాశం ఏర్పడింది.
FCRA అనుమతి ఎందుకు కీలకం?
సామాజిక సేవ, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు విదేశాల నుంచి ఆర్థిక సహాయం పొందాలంటే, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టం కింద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ నిబంధనల్లో ఇటీవల మార్పులు జరిగిన నేపథ్యంలో, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఈ అనుమతి కోసం కేంద్ర హోంశాఖను సంప్రదించింది. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust) నిస్వార్థ సేవలను, ముఖ్యంగా రక్తదానం, నేత్రదానం వంటి కీలక రంగాల్లో ట్రస్ట్ చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర హోం శాఖ, ఈ విజ్ఞప్తిని పరిశీలించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై ఆమోదముద్ర వేసినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఈ అనుమతి ట్రస్ట్కు మరింత జవాబుదారీతనాన్ని, అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచుతుంది.
Also Read- Rangeela Re Release: క్లాసిక్ ఫిల్మ్ ‘రంగీలా’ రీ-రిలీజ్.. దివంగత నటుడిని గుర్తు చేసుకున్న ఆమిర్ ఖాన్
ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి సేవలు అందిస్తోంది. నిరంతరాయంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, నేత్రదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ట్రస్ట్ ఒక ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ అనుమతి లభించడంతో, విదేశాల్లో స్థిరపడిన చిరంజీవి అభిమానులు, దాతలు, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ సేవా కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు మార్గం సుగమమైంది. చిరంజీవి దాతృత్వానికి కేంద్రం నుంచి ఈ గుర్తింపు లభించడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎఫ్సీఆర్ఏ అనుమతి ట్రస్ట్ సేవలకు కొత్త ఊపునిస్తుందని, మరింత ఎక్కువ మందికి సహాయం చేయడానికి వీలవుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ అనుమతితో, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఏపీలోనూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చిరంజీవిపై మెగా ఫ్యాన్స్ ఒత్తిడి తెస్తున్నారు. ఆ దిశగా కూడా చిరు అడుగులు పడే అవకాశం ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
